
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ మళ్లీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే సోమవారం (ఫిబ్రవరి 17) ఎఫ్ఈవో సీఈవో అల్బర్ట్ను ఏసీబీ అధికారులు విచారించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరు కావాలని గత నెలలోనే అల్బర్ట్కు ఏసీబీ నోటీసులు జారీ చేయగా.. అతడు సోమవారం (ఫిబ్రవరి 17) లండన్ నుంచి వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజన్ 9 ఫార్ములా ఈ కార్ రేసు చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ వంటి అంశాలపై ఏసీబీ అల్బర్ట్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ALSO READ | Hydra: హైదరాబాద్లో అలాంటి ఫ్లాట్లు ఎవరు కొనొద్దు
కాగా, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు జరిగిందన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా చేర్చారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది. తాజాగా.. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులను ప్రశ్నిస్తోంది.