- ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదు
- ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: హనుమకొండ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (డీటీవో) పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుతో శుక్రవారం తెల్లవారుజామున ఏక కాలంలో 10 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీనివాస్ ఇంటితో పాటు హనుమకొండ, భీమారం, వరంగల్, జగిత్యాల, కరీంనగర్లోని ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు జరిపారు.
తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన సోదాలు.. రాత్రి వరకు కొనసాగాయి. హైదరాబాద్ సహా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, జగిత్యాలలో వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వ్యవసాయ భూములు, ప్లాట్స్సహా మొత్తం రూ.4.5 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు. వీటి విలువ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం దాదాపు రూ.15 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయాల్సి ఉంది. ఈ మేరకు శనివారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.