పెండ్లికి వెళ్తుండగా ప్రమాదం: నలుగురి మృతి

పెండ్లికి వెళ్తుండగా ప్రమాదం: నలుగురి మృతి

పెండ్లి వేడుకలో పాల్గొనడానికి బయలుదేరిన కుటుంబ సభ్యుల వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ డివిజన్ కల్హేర్ మండలంలోని బాచెపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర దెగ్లూర్ కు చెందిన సునీత,గుండప్ప కుటుంబీకులు హైదరాబాద్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు తుఫాన్ వాహనంలోబయలుదేరారు. ఉదయం సుమారు 8 గంటలప్రాంతంలో అకోలా–నాందేడ్ హైవేపై లారీ, తుఫాన్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరిని హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా దారిలో చనిపోయారు. 11మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఏడుగురిని నారాయణఖేడ్, నలుగురిని సంగారెడ్డి హాస్పిటల్ కు తరలించారు. మృతిచెందిన వారిలో తుఫాన్ డ్రైవర్ షేక్ మన్నన్(35), శివాని (19),రజని(60), చిట్టి ( 10 నెలల పాప) ఉన్నారు. లారీడ్రైవర్ పరారీలో ఉన్నాడు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సత్యనారాయణ రాజు, కంగ్టి సీఐ తిరుపతియాదవ్ పరిశీలించారు.