
వనపర్తి, వెలుగు: ధని లోన్ యాప్ ద్వారా రూ.2కోట్లు కాజేసిన సైబర్ నేరస్థుల ముఠా కీలక నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. గోపాల్పేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన శివకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి విడతల వారీగా రూ.32,125 ఫోన్ పే ద్వారా కాజేశారు.
ఇంకా డబ్బులు పంపాలని డిమాండ్ చేయడంతో, అనుమానం వచ్చి బాధితుడు సైబర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ రత్నం, వనపర్తి సీఐ కృష్ణయ్య, గోపాల్పేట ఎస్సై నరేశ్ ఫోన్ నంబర్ను ట్రేస్ చేసి సూర్తి తండాకు చెందిన వెంకటేశ్గా గుర్తించారు. ఢిల్లీ, బీహార్, కోల్కతా రాష్ట్రాల్లోని సైబర్ నేరగాళ్లతో కలిసి ఫోన్లు చేసి డబ్బులు వచ్చాక, వారికి పంపేవాడు. వారు కమీషను ఇచ్చినట్లు శివ ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.4 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సైబర్ క్రైమ్ ఎస్సై రవి ప్రకాశ్, సిబ్బంది ఉన్నారు.