
- అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
లింగాల, వెలుగు : గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం లింగాల మండల పరిధిలోని ధారారం, కేపీ తాండ, అంబటిపల్లి, జిలుగుపల్లి తదితర గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొండల్రావు, మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, లింగాల టౌన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ సుడిగాలి పర్యటన
అమ్రాబాద్, వెలుగు : అమ్రాబాద్ ఉమ్మడి మండలంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సుడిగాలి పర్యటన చేశారు. గురువారం పదర మండలంలోని గానుగుపెంట వద్ద ప్రజా పాలన లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ అందించారు. అనంతరం వంకేశ్వరం, అమ్రాబాద్, మన్ననూర్ తదితర గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణం, ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ప్రతిపక్షాలు చేసే అపోహలను నమ్మవద్దని సూచించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేయలేనిది ఏడాది కాలంలో రేవంత్ సర్కార్ చేసి చూపిందన్నారు. ఇరు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.