N కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టుకు వెళతా : హీరో నాగార్జున

N కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టుకు వెళతా : హీరో నాగార్జున

మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంపై హీరో నాగార్జున  ట్విట్టర్(ఎక్స్ )లో  స్పందించారు. తాము ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని..అది పట్టా భూమి అని చెప్పారు.  కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చేశారని తెలిపారు.. చట్టాన్ని ఉల్లంఘించలేదన్నారు. చెరువులో అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని ,ప్రైవేట్ ల్యాండ్ లోనే నిర్మించినట్లు వెల్లడించారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలపై కోర్టుకెళ్తామని చెప్పారు నాగార్జున. 

 నాగార్జున కామెంట్స్.. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం , చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలియజేయడం కోసం  ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను.  ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది.  స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది.  

ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం.  అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అని నాగార్జున ప్రకటన జారీ చేశారు.  

మాదాపూర్ ఎన్ కన్వెన్షన్లో అక్రమ కట్టడాలను ఆగస్టు 24న ఉదయం 7 గంటల నుంచి  11 గంటల వరకు నాన్ స్టాప్ గా హైడ్రా ఆధ్వరంలో కూల్చివేతలు కొనసాగాయి. మొత్తం 6 భారీ మిషన్లు, జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు, సిబ్బంది. మాదాపూర్ లోని తుమ్మిడి చెరువు భూమిని ఆక్రమించి.. నాగార్జున  N కన్వెన్షన్ నిర్మించారు. చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో హైడ్రా చర్యలు తీసుకుంటోంది. మూడున్నర ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసి నాగార్జున కన్వెన్షన్ కట్టినట్టు నిర్దారణ అయ్యింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు కొనసాగాయి.