
‘‘రాబిన్హుడ్’ చిత్రంలోని నా పాత్ర చూసాక నేను హీరోగా నటించిన కామెడీ సినిమాలు, ఆనాటి రోజులు ప్రేక్షకులకు గుర్తుకు వస్తాయి’ అన్నారు రాజేంద్ర ప్రసాద్. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన కీలకపాత్రలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చి 28న విడుదలవుతున్న సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ఇలా ముచ్చటించారు.
నలభై ఎనిమిదేళ్ల సినీ కెరీర్లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఇప్పటికీ దర్శకులు నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం నా అదృష్టం. ‘రాబిన్హుడ్’ సినిమా చూసినప్పుడు కూడా ఆ స్పెషాలిటీ ప్రేక్షకులు ఫీల్ అవుతారు. క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ పరంగా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. దర్శకుడు వెంకీ అద్భుతంగా రాశాడు, అంతే బాగా తీశాడు.
ఇండియాలోనే హయ్యస్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ యజమానిగా నటించా. హీరో నితిన్ నా ఏజెన్సీలో పని చేయడానికి వస్తాడు. ఫారిన్ నుంచి వచ్చిన శ్రీలీలకు సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మాది. ఇంతకంటే కథ చెప్పకూడదు (నవ్వుతూ). నా టైమింగ్ను నితిన్, అతని టైమింగ్ నేను ఫాలో అవ్వాలి. క్యారెక్టర్స్ను అలా డిజైన్ చేశారు. అలాగే వెన్నెల కిషోర్కు మేము దొరక్కూడదు. చాలా సరదాగా ఉంటుంది. ఆడియన్స్కి మంచి ఫీస్ట్.
దర్శకుడు వెంకీ నా పాత్రను చాలా ప్రత్యేకంగా రాసుకున్నారు. తన గురువు త్రివిక్రమ్ తరహాలో వెంకీ డైలాగ్స్లో మంచి పంచ్ ఉంటుంది. వర్క్ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశా. తను బిగ్ డైరెక్టర్ అవుతారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, ఓ బేబీ, ఎఫ్2 చిత్రాల్లోని పాత్రల తరహాలో ఇందులోని పాత్రను కూడా గుర్తుంచుకుంటారు. అలాగే వందకోట్లు దాటిన కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. నితిన్కి ఈ సినిమాతో ఆ స్టేచర్ వస్తుంది.
కొత్త నటీనటులు, దర్శకులు నాతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే నాకు కొత్త పాత అని ఉండదు. అందరికంటే ముందు నేనే సెట్స్లో తెగ అల్లరి చేస్తా. దీంతో అందరూ చాలా కంఫర్ట్ బుల్గా ఫీలౌతారు. అందుకే నాతో వర్క్ చేయడం చాలా ఈజీ. ప్రస్తుతం ఏడు సినిమాల్లో నటిస్తున్నా. మరో ఐదు చిత్రాలు మొదలవబోతున్నాయి.
నటుడిగా ఈ జీవితం దేవుడు, ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప అవకాశం. నాటి ప్రధాని పీవీ నరసింహారావు మొదలు ఇప్పటికీ చాలామంది తమ జీవితంలో ఒత్తిడి, నిరాశలో వున్నప్పుడు మనసు తేలిక అవడానికి నా సినిమాలు చూస్తుంటామని చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.