పీరియాడికల్​ మూవీలో నటించాలనుంది : రీతూ వర్మ

పీరియాడికల్​ మూవీలో నటించాలనుంది : రీతూ వర్మ

‘హీరోయిన్‌‌గా చాలా మంచి పాత్రలు పోషించాను.. అందులో గుర్తు పెట్టుకునేవి ఉండటం సంతోషంగా ఉంది’ అని చెప్పింది రీతూ వర్మ. సందీప్ కిషన్‌‌కు జంటగా ఆమె నటించిన చిత్రం ‘మజాకా’. త్రినాధరావు నక్కిన దర్శకుడు. ఏకే ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌తో కలిసి రాజేష్ దండా నిర్మించారు.  ఈనెల 26న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రీతూ వర్మ ఇలా ముచ్చటించింది. 

‘‘మజాకా చిత్రం కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. అదే సమయంలో హై ఎమోషనల్‌‌ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా నేను, అన్షు గారు పోషించిన పాత్రలకు కథలో ప్రాధానత్య ఉంది. నేను కాలేజీ అమ్మాయిగా కనిపిస్తా. తన బాల్యంలోని ఓ ఎమోషనల్ కాన్‌‌ఫ్లిక్ట్‌‌ ఆమెపై ఎలాంటి ప్రభావం చూపించింది, సందీప్ కిషన్ పాత్రతో తన రిలేషన్ ఏమిటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు నా పాత్రను చాలా ఇంట్రెస్టింగ్‌‌గా ప్రజెంట్  చేశారు. సందీప్ లాంటి పాజిటివ్ పర్సన్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. అన్షు గారు చాలా హార్డ్ వర్కింగ్. రావు రమేష్‌‌ గారితో ఓ సింగిల్ టేక్ సీన్ చేశాను. అది చాలా బాగా వచ్చింది. ఆయన డబ్బింగ్ పూర్తి చేసి, తన  కెరీర్‌‌‌‌లో అలాంటి సీన్‌‌ చూడలేదని ఫోన్‌‌లో చెప్పడం ఎప్పటికీ మర్చిపోలేను..

 డైరెక్టర్ త్రినాధ్ రావు గారు చాలా ఎనర్జిటిక్‌‌గా ఉంటారు. సెట్‌‌లో అందరినీ అదే ఎనర్జీతో ఉంచుతారు. ప్రమోషన్స్‌‌లోనూ అది కనిపిస్తోంది. అలాగే పాటలన్నీటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజేష్ గారు, అనిల్ గారు పాషనేట్ ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడక్షన్‌‌లో  మరో సినిమా చేయాలని వుంది. ఇక నా కెరీర్‌‌‌‌ విషయంలో సంతృప్తిగా ఉన్నా. ఇప్పటివరకూ చాలా మంచి పాత్రలు పోషించా. అందులో జనం గుర్తు పెట్టుకునేవి ఉండటం ఫుల్‌‌ హ్యాపీ.  యాక్షన్, కామెడీ రోల్స్‌‌తో పాటు ఫుల్‌‌ లెంగ్త్‌‌ పీరియాడికల్​ మూవీలో నటించాలనుంది.  ప్రస్తుతం ‘శ్రీకారం’ ఫేమ్ కిషోర్ డైరెక్షన్‌‌లో ఓ వెబ్ సిరీస్‌‌ షూట్ పూర్తి చేశాను. త్వరలో హాట్‌‌ స్టార్‌‌‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది’’.