
- రేపు రీతూ చౌదరి, విష్ణుప్రియను
- మళ్లీ విచారించనున్న పోలీసులు
- జాడలేని హర్షసాయి,ఇమ్రాన్ఖాన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదైన 11 మంది విచారణ కొనసాగుతున్నది. ఆదివారం వరకు టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించగా, సోమవారం నటి, యాంకర్ శ్యామల స్టేషన్లో అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే విచారణకు హాజరైన విష్ణుప్రియ, రీతూ చౌదరి ఈ నెల 25న మళ్లీ ఎంక్వైరీకి రానున్నారు. యాంకర్ శ్యామల తనపై ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు, విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు ఆదేశాలిచ్చింది.
దీంతో ఆమె సోమవారం విచారణకు హాజరుకానున్నారు. వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది. అటు మియాపూర్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో విజయ్దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శోభా శెట్టి, సిరి హన్మంతు, శ్రీముఖి సహా పంజాగుట్ట పీఎస్లో విచారణ ఎదుర్కొంటున్న 11 మందిపైనా కేసు నమోదు కాగా, ఈ ఎంక్వైరీ ఇంకా మొదలుకాలేదు. మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన తర్వాత సెలబ్రిటీలను విచారణకు పిలుస్తారని సమాచారం.