- జూన్క్వార్టర్లో రూ. 1,458 కోట్లకు..
- మొత్తం ఆదాయం రూ.26,067 కోట్లు
- ఎఫ్ఎంసీజీ వ్యాపారం విభజనకు ఓకే
న్యూఢిల్లీ : బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్కు జూన్ క్వార్టర్లో రెట్టింపు కంటే ఎక్కువ నికర లాభం వచ్చింది. న్యూ ఎనర్జీ వ్యాపారంలో వృద్ధి కారణంగా కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 1,458 కోట్లకు చేరింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 675 కోట్ల కంటే 116 శాతం ఎక్కువ. కంపెనీ కొత్త ఎనర్జీ బిజినెస్ యూనిట్ అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఏఎన్ఐఎల్) సోలార్ తయారీ, విండ్ టర్బైన్ వ్యాపారాలలో వృద్ధి కారణంగా వడ్డీ, పన్నులు, తరుగుదల, అప్పుల చెల్లింపు (ఇబిటా) కంటే ముందు ఆదాయాలు 3.6 రెట్లు పెరిగి రూ. 1,642 కోట్లకు చేరుకున్నాయి.
కంపెనీ మొత్తం ఇబిటాలో 38 శాతం నుంచి న్యూ ఎనర్జీ వెర్టికల్ నుంచి వచ్చింది. ఇది ప్రస్తుత 2024–-25 ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ. 2,897 కోట్ల నుంచి 48 శాతం పెరిగి రూ. 4,300 కోట్లకు చేరుకుంది. విమానాశ్రయాల వ్యాపారం ఇబిటా కూడా 33 శాతం వృద్ధితో రూ. 682 కోట్లకు చేరుకుంది. బొగ్గు ట్రేడింగ్ వ్యాపార ఆదాయం 34 శాతం తగ్గింది. ధరల పతనం వల్ల రూ. 15,042 కోట్ల వ్యాపారం మాత్రమే జరిగింది. అదానీ గ్రూప్ నిర్వహించే విమానాశ్రయాలు ఈ క్వార్టర్లో 7 శాతం ఎక్కువ మంది ప్రయాణికులను రవాణా చేశాయి. వీరి సంఖ్య 2.28 కోట్లకు చేరింది.
సరుకు రవాణా 17 శాతం పెరిగి 2.7 లక్షల టన్నులకు చేరింది. నికర ఆదాయంలో 15 శాతం న్యూ ఎనర్జీ వ్యాపారం నుంచి వచ్చింది. మొత్తం ఆదాయం 13 శాతం పెరిగి రూ.26,067 కోట్లకు చేరింది. క్లీన్ఎనర్జీ, రహదారి నిర్మాణ వ్యాపారాలు కూడా వృద్ధిని సాధించాయి. కంపెనీ బోర్డు ఎఫ్ఎంసీజీ వ్యాపారం విభజనను ఆమోదించింది. జాయింట్ వెంచర్కంపెనీ అదానీ విల్మార్ ఫార్చూన్ బ్రాండ్ పేరుతో నూనెలు, పప్పులు, పిండి, బియ్యం వంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులను అమ్ముతోంది.