
- 2023-24 లో నికర లాభం 55 శాతం పెరిగి రూ.30,767 కోట్లకు
- వచ్చే పదేండ్లలో రూ.7.47 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడి
న్యూఢిల్లీ : యాపిల్స్ నుంచి ఎయిర్పోర్టుల వరకు వివిధ బిజినెస్లలో ఉన్న అదానీ గ్రూప్ కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.30,767 కోట్ల నికర లాభం (లిస్టెడ్ కంపెనీల ప్రాఫిట్) సాధించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.19,833 కోట్లతో పోలిస్తే 55 శాతం పెరిగింది. వచ్చే పదేళ్లలో 90 బిలియన్ డాలర్ల (రూ.7.47 లక్షల కోట్ల) క్యాపెక్స్ చేస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.
హిండెన్బర్గ్ రిపోర్ట్ దెబ్బకు కుదేలైన అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు, ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాయి. 2023–24 లో అప్పులు తగ్గించుకోవడం, తనఖాలో ఉన్న ప్రమోటర్ల వాటాను తగ్గించుకోవడం, కీలకమైన బిజినెస్లపై ఫోకస్ పెట్టడం వంటి స్ట్రాటజిక్ నిర్ణయాలను అదానీ గ్రూప్ తీసుకుంది. ఈ గ్రూప్ నికర లాభం గత ఐదేళ్లలో ఏడాదికి సగటున 54 శాతం చొప్పన పెరగడం విశేషం. అదానీ గ్రూప్ రెవెన్యూ కిందటి ఆర్థిక సంవత్సరంలో 6 శాతం తగ్గినా, ఇబిటా (ట్యాక్స్లు, వడ్డీలకు ముందు ప్రాఫిట్) మాత్రం 40 శాతం పెరిగి రూ.66,244 కోట్లకు చేరుకుంది.
గ్రూప్ నికర అప్పులు (8 కంపెనీలు+ సిమెంట్ బిజినెస్ కొనుగోలుకు చేసిన అప్పు) రూ.2.2 లక్షల కోట్ల దగ్గర నిలకడగా ఉన్నాయని, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ రూ.2.3 లక్షల కోట్లుగా ఉందని అదానీ గ్రూప్ పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో అదానీ పోర్ట్స్, అదానీ పవర్ నికర అప్పులు తగ్గాయని, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ అప్పులు పెరిగాయని తెలిపింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2023–24 లో సోలార్ మాడ్యుల్, విండ్ టర్బైన్ల తయారీ ప్లాంట్ను, కాపర్ స్మెల్టర్ను ఏర్పాటు చేసింది. అదానీ సిమెంట్ సంఘీ సిమెంట్ను కొనుగోలు చేసింది. అదానీ పోర్ట్స్ గోపాల్పూర్ పోర్ట్ను కొనుగోలు చేయగా, అదానీ పవర్ 1.6 గిగావాట్ల గొడ్డ పవర్ ప్లాంట్ను ప్రారంభించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ కెపాసిటీ 2.8 గిగావాట్లు పెరిగింది.