
- అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ
జైనూర్, వెలుగు: రానున్న వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని జైనూర్ మండలం దుబ్బగూడ గ్రామపంచాయతీలో పర్యటించి మిషన్ భగీరథ నీటి నాణ్యత, తాగునీటి కోసం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. గ్రామంలోని అధికారులు తీసిన తాగునీటి శాంపిల్స్ ను పరిశీలించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటిని అందించాలన్నారు.
నీటి ట్యాంకుల శుభ్రత, పైప్ లైన్ల మరమ్మతులను వేగవంతం చేసి లీకేజీ సమస్య లేకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతా, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతి గౌడ్, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, మిషన్ భగీరథ ఏఈ రంజిత్ , పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..