
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ని ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించే పదవ తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఖమ్మం జిల్లాలో ఓపెన్ పదవ తరగతి పరీక్షలు రాసే 655 మంది అభ్యర్థులకు 4 పరీక్షా కేంద్రాలు, 898 మంది ఇంటర్ అభ్యర్థులకు మరో 4 పరీక్షా కేంద్రాలను జిల్లా కేంద్రంలో సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షల పర్యవేక్షణకు 8 సిట్టింగ్ స్క్వాడ్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు.
పరీక్షా కేంద్రాల లోపలికి సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఎవరికి అనుమతి లేవని తెలిపారు. సెంటర్ల వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర వర్మ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కళావతి బాయి, ఓపెన్ స్కూల్ జిల్లా కన్వీనర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.