
- అడిషనల్ కలెక్టర్ రాంబాబు
సూర్యాపేట, వెలుగు : 2024 –-25 -యాసంగి సీజన్ లో ధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. రబీ యాక్షన్ ప్లాన్ పై మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేయాలన్నారు. టార్పాలిన్, వేయింగ్ స్కేల్స్, తేమను పరిశీలించే మిషన్లు, ప్యాడి క్లీనర్స్, కాలిబర్స్ మొదలైనవి సెంటర్లలో సమకూర్చాలని చెప్పారు.
అంతర్ రాష్ట్ర బోర్డర్స్ వద్ద చెక్ పోస్టులుఏర్పాటు చేసి బయటి రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి డి.రాజేశ్వర్, మేనేజర్ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ అప్పారావు, డీసీవో పద్మ, డీఏవో శ్రీధర్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి
యాదాద్రి, వెలుగు : వరి ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ అధికారులు, హార్వెస్టింగ్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రబీ 2024-– 25 సీజన్ లో సుమారు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.