- 0.001% నిర్లక్ష్యం వహించినా దాన్ని సరిదిద్దుకోండి
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- సకాలంలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ కామెంట్
- తదుపరి విచారణ వచ్చే నెల 8వ తేదీకి వాయిదా
న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్పరీక్షలో పేపర్ లీకేజీ, మాల్ప్రాక్టీస్ జరిగిందంటూ వస్తోన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. పరీక్ష నిర్వహణలో తప్పు జరిగితే ఒప్పుకోవాలని పేర్కొంది. ఎవరైనా 0.001% నిర్లక్ష్యం వహించినా దాన్ని వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే లో నిర్వహించిన నీట్లో అక్రమాలు జరిగాయని, దాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితోకూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది.
ఈ వ్యవహారంపై ఎన్టీఏ సకాలంలో చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని కామెంట్ చేసింది. అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని సూచించింది. ‘‘ఏజెన్సీగా ఓ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ఫెయిర్గా ఉండాలి. ఏదైనా పొరపాటు జరిగితే ఒప్పుకోవాలి. దాన్ని సవరించేందుకు చర్యలు చేపట్టాలి. ఇది మీపై విశ్వాసాన్ని కలిగిస్తుంది”అని బెంచ్ వ్యాఖ్యానించింది. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు స్టూడెంట్స్ పడ్డ కష్టాన్ని ఏజెన్సీ మరిచిపోకూడదని సూచించింది. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి డాక్టర్ అయితే.. సమాజానికి ఎంత హానికరమో ఒక్కసారి ఊహించుకోవాలని చురకలంటించింది. తదుపరి విచారణను జులై 8న చేపడతామని స్పష్టం చేసింది.
నీట్పై ప్రధాని స్పందించట్లేదేం?: రాహుల్
దేశవ్యాప్తంగా నీట్పరీక్షపై విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 24 లక్షల మంది భవిష్యత్తు తారుమారవుతుంటే మోదీ ఎప్పటిలాగే స్పందించడం లేదని మండిపడ్డారు. పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా బలమైన విధానాల రూపకల్పనకు పార్లమెంట్లో తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు.