అసెంబ్లీ ఎన్నికలఫలితాలపై ఉత్కంఠ
19 కేంద్రాలలో కౌంటింగ్.. మూడంచెల భద్రత
8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ శనివారం జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలుకానుంది. మొత్తం 19 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారనేది మధ్యాహ్నానికి తేలిపోనుంది. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. 27 ఏండ్ల తర్వాత ఢిల్లీ పీఠం దక్కనుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ గెలుస్తుందని చెప్పినప్పటికీ.. ఆప్ లీడర్లు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గత రెండు ప్రభుత్వాలలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. దీంతో ఈసారైనా ఖాతా తెరవాలనే దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీలో ప్రచారం చేశారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
రిటర్నింగ్ అధికారి, స్పెషల్ అబ్జర్వర్, ఎమ్మెల్యే అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధుల సమక్షంలో ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరుస్తారు. ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. 8.30 నుంచి ఈవీఎం ఓట్లు లెక్కించడం ప్రారంభిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 2 కంపెనీల పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు సెక్యూరిటీ ఉంటారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఆథరైజ్డ్ పర్సన్లకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టు పక్క ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 5వేల మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు. వారిలో సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు.