
- సర్కార్ మారాక దూకుడు పెంచిన అవినీతి నిరోధక శాఖ
- నిరుడు మొత్తం కేసులు 94
- గత మూడు నెలల్లోనే 42 కేసులు నమోదు
కరీంనగర్, వెలుగు : కొత్త సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏసీబీ దాడులు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అక్రమాస్తులు కూడబెట్టిన అధికారులపై ఎంక్వైరీ చేయడంతోపాటు గవర్నమెంట్ ఆఫీసుల్లో పైసలు అడిగినోళ్లను, స్కీముల్లో అవినీతి పాల్పడినోళ్లను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. రాష్ట్రంలో మూడు నెలల్లో 42 ఏసీబీ కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజిని అక్రమాస్తుల కేసు, గొర్రెల పంపిణీ స్కీమ్ లో కోట్లాది రూపాయల నిధుల మళ్లింపు గత మూడు నెలల్లోనే జరిగాయి. ఏసీబీ డైరెక్టర్ జనరల్(డీజీ)గా సీవీ అనంద్ బాధ్యతలు స్వీకరించాక తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆయన నిత్యం జిల్లాల్లోని డీఎస్పీలతో మాట్లాడుతుండడం, సమీక్షలు నిర్వహిస్తుండడంతో వారు కూడా దూకుడు పెంచారు.
రెండు రోజులకో చోట..
రాష్ట్రంలో సగటున రెండు రోజులకో చోట ఏసీబీ ట్రాప్ అవుతోంది. ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వండని ఏసీబీ అధికారులు గవర్నమెంట్ ఆఫీసుల్లో పోస్టర్లు, స్టిక్కర్లు అంటించడం, నిత్యం ఏదో ఒక చోట ఏసీబీ దాడులు జరుగుతుండడంతో ప్రజలు కూడా లంచం అడిగే ఆఫీసర్లను పట్టించేందుకు ముందుకొస్తున్నారు. నిరుడు మొత్తం కలిపి ఏసీబీ 94 కేసులు నమోదు చేస్తే కొత్త ప్రభుత్వంలో, కొత్త సంవత్సరంలో మూడు నెలలు కూడా గడవకముందే 42 కేసులు నమోదు కావడం గమనార్హం.
సంచలనం సృష్టించిన కేసులు కొన్ని..
రాష్ట్రంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు సంచలనం సృష్టించింది. అతడికి బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తేలింది. అలాగే అతడి పేరిట మొత్తం 29 ఇండ్ల స్థలాలుండగా ఏపీలోని విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం శివ బాలకృష్ణ ఉంటున్న విల్లాతో పాటు హైదరాబాద్లో 4 , రంగారెడ్డి జిల్లాలో 3 అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లు ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. మొత్తంగా బహిరంగ మార్కెట్ లో ఆయన ఆస్తుల విలువ రూ. వెయ్యి కోట్ల పై మాటేనని తెలుస్తోంది.
ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బంధువైన జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజిని గత సర్కార్ హయాంలో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిందనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఆమె ఇంటితోపాటు బినామీలు, బంధువులకు చెందిన ఐదు ఇండ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇంట్లో రూ.3.20 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో వీటి విలువే రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె బినామీగా భావిస్తున్న వ్యక్తి పేరిట ధర్మసాగర్ మండలంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఏడు ఎకరాల్లో వెంచర్ వేసినట్లు గుర్తించారు. ఇందులో ఇంకా ప్లాట్లు అమ్మలేదని, వీటి విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ స్కీమ్ లో అవినీతి ప్రకంపనలు రేపింది. ఈ స్కామ్ పై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి కామారెడ్డి వెటర్నరీ దవాఖాన అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేశ్ను అరెస్టు చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై.. నకిలీ పత్రాలు, బ్యాంక్ అకౌంట్లు సృష్టించి సుమారు రూ. 2.10 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.
మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోనే ఎక్కువ...
ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ ట్రాప్స్, అక్రమాస్తుల కేసుల్లో దొరికిన ఆఫీసర్ల లెక్కల ప్రకారం.. మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, మున్సిపాలిటీల్లో బిల్డింగ్ నిర్మాణ అనుమతుల నుంచి బర్త్, డెత్, ఫ్యామిలీ మెంబర్ తదితర సర్టిఫికెట్ల మంజూరు వరకు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారు. గత సర్కార్ హయాంలో అవినీతి ఆఫీసర్లపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా, పేపర్లలో కథనాలు వచ్చినా చర్యలు తీసుకోకుండా వెనకేసుకు రావడంతో అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. కొత్త ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు ఇలాంటి ఆఫీసర్ల భరతం పడుతున్నారు.