
రంగారెడ్డి జిల్లా: సినీ నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లావణ్య ఇంట్లోకి చేర్చుకుంది. అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తెల్లవారుజాము వరకు ఇంటి బయటే ఉన్నారు. దీంతో.. నార్సింగ్ పోలీసులు రంగ ప్రవేశం చేయకతప్పలేదు. లావణ్యకు నచ్చజెప్పి పోలీసులు ఇంట్లోకి పంపించేశారు. లావణ్య తమ కోడలు కాదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు చెప్పారు. లావణ్య తమ కొడుకుతో సహజీవనం చేసింది తప్ప.. తమ కొడుకు ఆమెను వివాహం చేసుకోలేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మీడియాకు చెప్పడం గమనార్హం.
కోకాపేట్లో ఉన్న విల్లా రాజ్ తరుణ్దని, తమ కొడుకు ఇంట్లో తాము ఉంటామని చెప్పుకొచ్చారు. గండిపేట మండలం కోకాపేటలో రాజ్తరుణ్కు ఒక ఇల్లు ఉండగా, అందులో కొంతకాలంగా లావణ్య ఉంటోంది. బుధవారం ఉదయం రాజ్తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజ్ కొంతమంది కేర్టేకర్లతో కలిసి కోకాపేటలోని ఇంటికి వచ్చారు. తన కొడుకు ఇంట్లో తాము ఉండటానికి వచ్చామని చెప్పారు. ఇంట్లోనే ఉన్న లావణ్య వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. రాజ్తరుణ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తాము ఇప్పటివరకు కిరాయి ఇంట్లో ఉంటున్నామని, సొంత ఇంటిలోకి వచ్చే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చామని వెల్లడించారు. ‘లావణ్య ఒక గదిలో ఉంటే, మేము మరో గదిలో ఉంటాం. ఇది మా సొంతిల్లు’ అని వాదించారు.
లావణ్య మాత్రం రాజ్తరుణ్ ఇంటిని తన పేరు మీద రాసిచ్చాడని, అతని తల్లిదండ్రులు గొడవ సృష్టించేందుకు వచ్చారని ఆరోపించింది. దీనిపై కోర్టులో కేసు ఉందని, ఉండాలనుకుంటే పోలీస్ స్టేషన్కు వెళ్లి అనుమతి తీసుకోవాలని ఆమె కోరింది. ఒక దశలో రాజ్తరుణ్ తల్లిదండ్రులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించే యత్నం చేయగా లావణ్య వారిని గేటు వద్దే అడ్డుకుంది. పోలీసులు లావణ్యకు నచ్చజెప్పడంతో ప్రస్తుతానికి ఈ వివాదానికి తెర పడింది.