
మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: తల్లి మందలించడంతో కనబడకుండా పోయిన యువకుడు పది రోజుల తర్వాత శవమై దొరికిన ఘటన చిలప్ చెడ్ మండలంలో జరిగింది. ఏఎస్సై మిస్బావొద్దీన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండ పోతుగల్ గ్రామానికి చెందిన తలారి లచ్చమ్మ చిన్న కొడుకు తలారి సత్యనారాయణ (27) డిగ్రీ పూర్తి చేశాడు. ఏ పనీ చేయడం లేదు. దీంతో తల్లి అతన్ని పని చేసుకోవాలని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన సత్యనారాయణ ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫ్రెండ్స్, చుట్టాల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. గత నెల 30న తల్లి లచ్చమ్మ చిలప్ చెడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా మండలంలోని చిట్కుల్ సమీపంలోని మంజీరా నది బ్రిడ్జి వద్ద నీటిలో తేలిన సత్యనారాయణ డెడ్ బాడీని గుర్తించారు.