సవాలుగా మారిన అఫ్జల్​ గంజ్​ కాల్పుల కేసు

సవాలుగా మారిన అఫ్జల్​ గంజ్​ కాల్పుల కేసు
  • నిందితులు బిహార్ గ్యాంగుకు చెందినవారు కాదని నిర్ధారణ!
  • సీపీ ఫుటేజీలు మినహా ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు దొరకలే
  • మహారాష్ట్ర లేదా ఢిల్లీకి ఎస్కేప్‌‌‌‌ అయి ఉంటారని పోలీసుల అనుమానం
  • నాలుగు రాష్ట్రాల పోలీసులతో కలిసి కొనసాగుతున్న జాయింట్​ఆపరేషన్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  అఫ్జల్‌‌‌‌గంజ్​కాల్పుల కేసు విచారణ పోలీసులకు సవాల్‌‌‌‌గా మారింది. దోపిడీ దొంగల ఆనవాళ్లు మినహా, ఎక్కడికి పరారయ్యారనే పక్కా సమాచారం లభించడం లేదు. సీసీ ఫుటేజీల ఆధారంగా ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌, తిరుమలగిరి అక్కడి నుంచి గజ్వేల్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌ మీదుగా రాష్ట్రం దాటి వెళ్లినట్లు గుర్తించారు. ఈ నెల 17న కర్ణాటకలోని బీదర్‌‌‌‌లో సెక్యూరిటీ గార్డులపై ఇద్దరు దుండుగులు కాల్పులు జరిపి, ఏటీఎం క్యాష్ రీఫిల్‌‌‌‌ వ్యాన్‌‌‌‌ నుంచి రూ. 93 లక్షల దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వారిద్దరూ హైదరాబాద్‌‌‌‌ వచ్చి అఫ్జల్‌‌‌‌గంజ్‌‌‌‌లోని రోషన్ ట్రావెల్స్‌‌‌‌ నుంచి ఛత్తీస్‌‌‌‌గఢ్​రాజధాని రాయ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు పారిపోయే క్రమంలో ట్రావెల్స్‌‌‌‌ ఉద్యోగి జహంగీర్‌‌‌‌పై కాల్పులు జరిపారు. అక్కడి నుంచి డబ్బుతో పరారయ్యారు. తిరుమలగిరి తర్వాత సీసీ కెమెరాలు లేకపోవడంతోపాటు కొన్ని ఫుటేజ్‌‌‌‌లు స్పష్టంగా లేకపోవడంతో దుండగులు ఎటు వెళ్లారనేది తెలియడం లేదు. ఆటో డ్రైవర్ల సమచారంతో తిరుమలగిరి వరకు ఆధారాలు లభించినప్పటికీ  అక్కడి నుంచి గజ్వేల్‌‌‌‌ మీదుగా మధ్యప్రదేశ్‌‌‌‌ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌‌‌‌ లేదా ఢిల్లీకి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు.

క్యాష్ బ్యాగ్స్ మారుస్తూ.. 

కర్నాటక, మధ్యప్రదేశ్‌‌‌‌, బిహార్ పోలీసులతో కలిసి సిటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌‌‌‌ కొనసాగిస్తున్నారు. దోపిడీ దొంగలు పక్కా ప్రొఫెషనల్స్ కావడంతో పోలీసులకు సవాళ్లు ఎదురతున్నాయి. మొదట దొంగలు బిహార్‌‌‌‌కు చెందిన అమిత్ కుమార్, అనిశ్ గ్యాంగ్‌‌‌‌కు చెందినవారని అనుమానించారు. అయితే అదే గ్యాంగ్‌‌‌‌అని నిర్ధారణకు రాలేకపోతున్నారు. దొంగలు వేషాలు మారుస్తూ తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. క్యాష్‌‌‌‌ బ్యాగ్స్‌‌‌‌ను కూడా మార్చుకుని డబ్బు 
తరలించినట్లు అనుమానిస్తున్నారు.