బ్యారేజీలు అని చెప్పి..స్టోరేజీకి వాడిన్రు!

బ్యారేజీలు అని చెప్పి..స్టోరేజీకి వాడిన్రు!
  • మేడిగడ్డను స్టోరేజీకి వాడుతామని ఇరిగేషన్ ​అధికారులు మాకు చెప్పలేదు
  • కాళేశ్వరం కమిషన్​ ముందు టీజీఈఆర్ఎల్ ​జేడీ మనోజ్ వెల్లడి
  • బ్యారేజీలు కడ్తూనే మోడల్​ స్టడీస్ చేయించారు
  • గేట్లను తక్కువ ఎత్తుకు ఎత్తి పరీక్షలు చేశారు
  • దాంతో ప్రవాహ వేగం అంచనా వేయలేకపోయాం
  • టెయిల్​వాటర్​ లెవెల్స్​ తగ్గి.. మట్టి కొట్టుకుపోయి బ్యారేజీ కుంగిందని వ్యాఖ్య
  • టీజీఈఆర్ఎల్, ఎస్డీఎస్​వో ఆఫీసర్లను విచారించిన కమిషన్ ​చైర్మన్ ఘోష్

హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డను బ్యారేజీగానే పరిగణించి మోడల్​ స్టడీస్​ చేశామని.. దానిని డ్యామ్​లా స్టోరేజీకి వాడుతారనే సంగతి ఇరిగేషన్​ అధికారులు తమకు చెప్పలేదని తెలంగాణ ఇంజినీరింగ్​ రీసెర్చ్​ లేబొరేటరీస్​ (టీజీఈఆర్​ఎల్) జాయింట్​ డైరెక్టర్​ఏజీ మనోజ్​కుమార్ కాళేశ్వరం కమిషన్​ ముందు స్పష్టం చేశారు. ‘బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి వీల్లేదు.. ఫ్రీ ఫ్లో ఉండాల్సిందే.. మేము టెస్టులు చేసే సమయంలో మాకు బ్యారేజీ అని చెప్పారే తప్ప.. నీటిని స్టోర్​ చేస్తామని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు’ అన్నారు. 

మోడల్​ స్టడీస్​ చేయాలని ఇరిగేషన్​ శాఖ అధికారుల నుంచి 2016 అక్టోబర్​ 18న తొలి రిఫరెన్స్​ వచ్చిందని.. కానీ, అప్పటికే మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభమైందన్నారు. దీంతో మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు జరుగుతుండగానే మోడల్​ స్టడీస్​ చేయాల్సి వచ్చిందని తెలిపారు. 2017, 2018ల్లోనూ రిఫరెన్సులు ఇచ్చారన్నారు. శుక్రవారం బీఆర్​కే భవన్​లో టీజీఈఆర్​ఎల్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్​వో) అధికారులను కాళేశ్వరం కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ క్రాస్​ ఎగ్జామినేషన్​ చేశారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

పలువురు అధికారులు ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెల్లమొహం వేశారు. మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఎవరి నుంచి ఒత్తిళ్లు, ఆదేశాలు వచ్చేవని ఆయన ప్రశ్నించగా.. అధికారులంతా తమకేం తెలియదని, చెప్పలేమని సమాధానాలు చెప్పుకొచ్చారు. ఓ మహిళా అధికారి అయితే.. ఏం అడిగినా ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ అనే ఆన్సర్లు తప్ప ఏ ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పకపోయారు. మొత్తంగా శుక్రవారం టీజీఈఆర్​ఎల్​ జేడీ, మాజీ సీఈ, ముగ్గురు రీసెర్చర్​ ఆఫీసర్లు, ఎస్డీఎస్​వో సీఈ, ఈఈ, సీడీవో ఈఈలను జస్టిస్​ ఘోష్​ విచారించారు. 

నాలుగు కండిషన్లతో మోడల్​ స్టడీస్​

మోడల్​ స్టడీస్​ను నాలుగు కండిషన్ల ఆధారంగా చేస్తామని టీజీఈఆర్​ఎల్​ జేడీ మనోజ్​ కుమార్​ తెలిపారు. గరిష్ట వరద అంచనాల ప్రకారమే స్టడీస్​ ఉంటాయన్నారు. అంచనా వేసిన గరిష్ట వరదలో మొత్తం వరద (100 శాతం), 75 శాతం, 50 శాతం, 25 శాతం వరద వస్తే బ్యారేజీ ఎలా ఉంటుందన్న దాని ప్రకారం 2డీ, త్రీడీ మోడల్​ స్టడీస్​ చేస్తామన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 2017 మే, 2018 ఆగస్టు, 2019 జూన్​, 2023 మేలో పలు రకాల మోడల్​ స్టడీస్​ నిర్వహించామని చెప్పారు. ఇటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకూ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. ఆయా బ్యారేజీలకు సంబంధించిన 12 మోడల్​ స్టడీస్​ నివేదికలను జస్టిస్​ ఘోష్​కు సమర్పించారు. 

గేట్లను తక్కువ ఎత్తులో తెరిచి పరీక్షలు

టెయిల్​ వాటర్​ లెవెల్​ పరీక్షలు చేసేందుకు బ్యారేజీ గేట్లను కనీసం 2 మీటర్లు ఎత్తాల్సి ఉంటుందని.. కానీ, మేడిగడ్డ విషయంలో తక్కువ ఎత్తుకు ఎత్తి పరీక్షలు చేశారని మనోజ్​ కుమార్​ పేర్కొన్నారు. దీంతో సెకనుకు 3 నుంచి 6 మీటర్లు ఉండాల్సిన వరద ప్రవాహ వేగం.. సెకనుకు 15 మీటర్లుగా వచ్చిందన్నారు. దాని వల్లే వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయామన్నారు. దీంతో 2019లో వచ్చిన వరదలకు.. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడం వల్లే బ్యారేజీ దిగువన ఉండే టెయిల్​వాటర్​ లెవెల్స్​ తక్కువై 2019లో తొలిసారిగా బ్యారేజీకి డ్యామేజ్​ జరిగిందన్నారు. 

ఇంకా నష్టం జరగకుండా ఉండేందుకు సలహాలు ఇవ్వాలని 2020లో అధికారులు తమను సంప్రదించారని.. 2021, 2023లో పలు సిఫార్సులు చేశామని వివరించారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీని స్టోరేజీ పర్పస్​ కోసం డ్యాములా వాడుకుంటున్నారని మరికొందరు అధికారులు కూడా చెప్పారు. 

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా..! 

ఆమె ఒక సీఈ. డిపార్ట్​మెంట్​లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఒకప్పుడు టీజీఈఆర్​ఎల్​లో సీఈగా పనిచేసిన ఆమె.. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన మోడల్​స్టడీస్​లో కీలకంగా పనిచేశారు. కానీ, కాళేశ్వరం కమిషన్​ విచారణలో మాత్రం ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు. కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ మోడల్​ స్టడీస్​కు సంబంధించి ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. మోడల్​ స్టడీస్​ ఎప్పుడు చేశారు? బ్యారేజీలు కడుతున్నప్పుడే చేశారా? 

బ్యారేజీలు కట్టకముందు చేశారా? స్టడీస్​కు సంబంధించిన రిపోర్టులు ఇచ్చారా? మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం తెలుసా? బ్యారేజీకి డ్యామేజ్​ ఎప్పుడు జరిగింది? వంటి ఎన్నో ప్రశ్నలు అడిగారు. కానీ, ఆమె ఏ ప్రశ్న అడిగినా ‘నాకు తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ అంటూ దాటవేశారు. కొన్ని ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా తెల్ల మొహం వేశారు. దీంతో జస్టిస్​ పీసీ ఘోష్​ ఒకింత షాక్​కు గురయ్యారు.

మేడిగడ్డ డ్యామేజీపై ఫీల్డ్​ ఆఫీసర్లు చెప్పలే: ఎస్డీఎస్​వో సీఈ

వాస్తవానికి డ్యామ్​సేఫ్టీ యూనిట్లు (డీఎస్​యూ) బ్యారేజీలకు సంబంధించి ప్రీ మాన్సూన్​, పోస్ట్​ మాన్సూన్​ రిపోర్టులేవీ ఇవ్వలేదని ఎస్డీఎస్​వో సీఈ ప్రమీల స్పష్టం చేశారు. బ్యారేజీ కుంగాక పోస్ట్​మాన్సూన్​ రిపోర్ట్​ తయారు చేశారని, ఆ రిపోర్ట్​లోనే బ్యారేజీకి డ్యామేజ్​జరిగిందన్న విషయం తమకు తెలిసిందని ఆమె తెలిపారు. బ్యారేజీల్లో లీకేజీలకు సంబంధించిన వివరాలేవీ ఫీల్డ్​ అధికారులు తమకు చెప్పలేదని పేర్కొన్నారు. ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్​ యాక్టివిటీస్​ సరిగ్గా జరగలేదని, బ్యారేజీ సేఫ్టీ మెజర్స్​ తీసుకోలేదని, డ్యామ్​సేఫ్టీ ప్రోటోకాల్స్​ పాటించలేదని తెలిపారు. 

రూల్​బుక్​లో ఉన్న ఓ అండ్​ ఎం ప్రొటోకాల్​, గేట్స్​ ప్రొటోకాల్​ను పాటించలేదని పేర్కొన్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజ్​పై ప్రాజెక్ట్​ అధికారులు ఎస్డీఎస్​వోకు సమాచారం ఇవ్వలేదని ఎస్డీఎస్​వో ఈఈ విజయలక్ష్మి చెప్పారు. బ్యారేజీని 2022 అక్టోబర్​ 28న సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్​ ఏబీ పాండ్యాతో కలిసి పరిశీలించామని, అప్పుడే ఆయన కొన్ని సూచనలు చేశారని తెలిపారు. పియర్ల నిర్మాణం జరిగేటప్పుడు ఎస్డీఎస్​వో అధికారులు సైట్​ను పరిశీలించలేదన్నారు. 

పై అధికారుల ఆదేశాలతోనే : సీడీవో ఈఈ

డ్యామ్​ సేఫ్టీ చట్టం రావడానికి ముందే డ్యామ్​ సేఫ్టీ సెల్స్​ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలను సీడబ్ల్యూసీ ఆదేశించిందని సీడీవో ఈఈ రఘునాథ్​ శర్మ చెప్పారు. దీంతో 1995లో ఉమ్మడి రాష్ట్రంలో జీవో 382 ప్రకారం డ్యామ్​ సేఫ్టీ సెల్​ను ఏర్పాటు చేశారన్నారు. ఈఈ దానికి చీఫ్​గా ఉండేవారన్నారు. అయితే, ఆ తర్వాత దాని బాధ్యతలు ఎస్​ఈ స్థాయి అధికారి చూసేలా జీవో 140 ద్వారా అధికారాలు కల్పించారన్నారు. 

బ్యారేజీ కుంగడానికి ఓ అండ్​ ఎం నిర్లక్ష్యం ఒక్కటే ప్రధాన కారణం కాదని, పాలసీ గ్యాప్​ ఉండడం వల్లే నష్టం జరిగిందని అన్నారు. తన అభిప్రాయ ప్రకారం డిపార్ట్​మెంట్​లోని పై స్థాయి అధికారుల నిర్లక్ష్యమే మేడిగడ్డ కుంగడానికి కారణమై ఉంటుందని అన్నారు.