రైతు భరోసా ఎవుసం చేసెటోళ్లకే..ఇదే ప్రభుత్వ ఆలోచన : మంత్రి తుమ్మల నాగేశ్వర​రావు

రైతు భరోసా ఎవుసం చేసెటోళ్లకే..ఇదే ప్రభుత్వ ఆలోచన : మంత్రి తుమ్మల నాగేశ్వర​రావు
  •     రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం
  •     ప్రతి పంట, రైతుకు బీమా వర్తించేలా రూ.3 వేల కోట్లతో ఇన్సూరెన్స్ 
  •     రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి
  •     ఢిల్లీలో ప్రపంచ ఆహార సదస్సుకు హాజరు
  •     పలు ఫుడ్​ ప్రాసెసింగ్​ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులతో భేటీ

న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో వ్యవసాయం చేసే వాళ్లకే రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ఆలోచన అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. పంట ఎవరైతే పండిస్తారో వారికే చేయూత ఇవ్వాలని, అదే సరైన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. రైతు భరోసా సాయంపై కౌలు రైతు, భూమి ఓనర్ చర్చించుకోవాల్సిన అవసరం ఉందని, ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవని చెప్పారు. తెలంగాణ, ఏపీలో భూ చట్టాలు వేరని అన్నారు. 

గురువారం ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ప్రపంచ ఆహార సదస్సులో రాష్ట్రం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా లులు గ్రూప్​ చైర్మన్ యూసుఫ్ అలీ, మోనిన్ ఇండియా ఎండీ జెర్మైన్ అరౌద్, బీఎల్ ఆగ్రో ఎండీ నవనీత్ రవికర్ తో పాటు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. తర్వాత భారత్ మండపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్​ను సందర్శించి, రాష్ట్రానికి చెందిన పలు స్టాళ్లను పరిశీలించారు. 

అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వర​రావు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కేవలం 20 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిందని..  కానీ కాంగ్రెస్ సర్కార్  42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నదని చెప్పారు. రూ. 2 లక్షల లోపు పంట రుణం ఉన్న 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ చెల్లిస్తుందని చెప్పారు. ప్రతి పంట, ప్రతి రైతుకు బీమా వర్తించేలా రూ.3,000 కోట్లతో ఇన్సూరెన్స్ చేయనున్నట్లు  ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలి

వివిధ రంగాల్లో తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శివరాజ్ సింగ్ చౌహాన్, చిరాగ్ పాశ్వాన్ తో ఆయన సమావేశం అయ్యారు. తొలుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో కలిసి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుల ఏర్పాటు ప్రక్రియను స్పీడప్​ చేయాలన్నారు. 

అనంతరం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో తుమ్మల భేటీ అయ్యారు. తెలంగాణలో నూతన కోకోనట్ బోర్డ్  ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఆయిల్ పామ్ మీద 28%  దిగుమతి సుంకం విధించి, దేశీయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్ పామ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తేనే ఆ పంట సాగు చేసే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. దిగుమతులను తగ్గించి దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహిస్తే పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తగ్గించవచ్చని తెలిపారు.  ఆ కోవలోనే ఆయిల్ పామ్​కు కేంద్రం కనీస మద్దతు ధర కల్పించాలని మంత్రి తుమ్మల కోరారు. 

ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇటీవలి ఖమ్మం జిల్లా వరదల గురించి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ప్రత్యేకంగా చర్చించారు. జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రి కండ్లారా చూసినందున తగిన మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందజేయాలని ఆయన కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి చౌహాన్​ సానుకూలంగా స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టంపై నివేదిక రాగానే త్వరగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

 తెలంగాణలో ఎక్కువగా పండే పంటలకు  రాష్ట్రంలో  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ను కలిసి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన లీలా ప్యాలెస్ హోటల్​లో డెలాయిట్ ఇండియా నిర్వహించిన ‘గ్రోత్ విత్ ఇంపాక్ట్ - గవర్నమెంట్’ సమిట్​లో పాల్గొని  లీడర్స్ టాక్ సెషన్​లో భాగంగా ‘వికసిత్ తెలంగాణ’ అంశంపై ప్రసంగించారు.