
- మూడు సబ్జెక్ట్లో సులువైన పద్ధతిలో బోధన
- వారానికి రెండు రోజులు ఒక్కో సబ్జెక్ట్ బోధన
నల్గొండ, యాదాద్రి, వెలుగు : గవర్నమెంట్ స్కూల్స్లోని స్టూడెంట్స్చదువులో వెనకబడిన వారిలో సామర్థ్యాలు పెంచేందుకు ప్రవేశపెట్టిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బోధన సత్ఫలితాలు ఇస్తోంది. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్ట్ల్లో ప్రత్యేకంగా బోధిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హైస్కూల్తో కలిసి ఉన్న ప్రైమరీ స్కూల్లో 3,4,5 తరగతులు చదువుతున్న స్టూడెంట్స్కు బోధిస్తున్నారు. ఇందుకోసం హైస్కూల్లోని కంప్యూటర్లను వినియోగిస్తున్నారు.
సాంకేతిక సమస్య..
ఏఐ బోధనలో కొన్ని స్కూల్స్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో స్టూడెంట్స్ కొంత ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ ఇబ్బందుల కారణంగా ఆలస్యమవుతోంది. మ్యాథ్స్ ప్రాక్టీస్ కోసం 100 ఎంబీపీఎస్ స్పీడ్ సామర్థ్యం ఉంటేనే వేగంగా ఏఐ బోధన జరిగే అవకాశం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్స్లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తోందంటున్నారు. దీంతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని టీచర్లు చెబుతున్నారు.
నల్గొండలో 14 స్కూల్స్.
జిల్లాలోని 10 మండలాల్లో 14 స్కూల్స్లో ఏఐ పాఠాలు బోధిస్తున్నారు. అనుముల మండలం హాలియా, కొత్తపల్లి, చిట్యాల మండలం నేరేడ, దామరచర్ల మండలం కల్లేపల్లి, దేవరకొండ మండలం ఇద్దంపల్లి, కేతేపల్లి మండలం తుంగతుర్తి, కొప్పోలు, మిర్యాలగూడ మండలం అన్నారం, మునుగోడు మండలం కొరటికల్, నల్లగొండ మండలం కంచనపల్లి, శాలిగౌరారం మండలం భైరవునిబండ, వేములపల్లి మండలం ఆమనగల్ స్కూల్స్లో ఏఐ తరగతులు నిర్వహిస్తున్నారు.
యాదాద్రిలో 9 స్కూల్స్..
యాదాద్రి జిల్లాలోని 7 మండలాల్లోని 9 పాఠశాలల్లో 96 మంది స్టూడెంట్స్కు ఏఐ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. చౌటుప్పల్ మండలం జైకేసారం, దేవలమ్మనాగారం, భువనగిరి మండలం తుక్కాపూర్, మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం, ఆలేరు మండలం కొల్లూరు, రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం, యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు, చల్లూరు, బీబీనగర్ మండలంలో జమీలాపేట స్కూల్స్లో ఏఐ తరగతులు నిర్వహిస్తున్నారు.
సూర్యాపేటలో..
సూర్యాపేట జిల్లాలో గరిడేపల్లి మండలం వెల్దండ, రాయనిగూడెం, గానుగబండ, సూర్యాపేట మండలం ఇమాంపేట, చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్, హుజూర్నగర్ మండలం బూరుగడ్డ, మోతె మండలం ఉండ్రుగొండ, నేరేడుచర్ల మండలం చింతకుంట్ల, మఠంపల్లి మండలం వరదాపురం, చింతలపాలెం మండలం తమ్మవరం, నడిగూడెం మండలం వల్లాపురం, మద్దిరాల మండలం రెడ్డిగూడెం, తిరుమలగిరి మండలం తొండ స్కూల్లో ఏఐ పాఠాలు బోధిస్తున్నారు.
వారానికి రెండ్రోజులు.. 40 నిమిషాల క్లాస్..
ఎంపిక చేసిన స్టూడెంట్స్లో ఐదుగురిని ఒక బ్యాచ్గా ఏర్పాటు చేసి.. ఒక్కొక్కరికి ఒక్కో కంప్యూటర్లో బోధిస్తున్నారు. ఈ విధంగా వారానికి రెండు రోజులు ఒక్కో సబ్జెక్ట్ బోధిస్తున్నారు. ఈ విధంగా ఒక వారంలో రెండు రోజులు తెలుగు బోధించినట్టయితే.. మరో వారం గణితం బోధిస్తున్నారు. ఈ విధంగా మూడు వారాల్లో మూడు సబ్జెక్ట్లు బోధించిన తర్వాత నాలుగో వారం మళ్లీ సబ్జెక్ట్ను రిపీట్చేస్తున్నారు. ఈ విధంగా ఒక్కో వారంలో ఒక్కో సబ్జెక్ట్పై 20 నిమిషాల చొప్పున 40 నిమిషాలు బోధిస్తున్నారు. ప్రాక్టీస్ అనంతరం ఏఐ పెట్టే టెస్ట్ లో స్టూడెంట్ కు 70 శాతం మార్కులు సాధిస్తే లెవెల్ –2 కు చేరుకుంటారు. దీంతో స్టూడెంట్ కు పాఠాలు అర్థమయ్యాయా.. లేదా..? అనేది ఏఐ గుర్తించి అర్థం కాకపోతే అతడికి అర్థమయ్యే రీతిలో బోధిస్తుంది.