
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంత కష్టమైన పని అయినా చాలా సులువుగా, ఎంతో మంది చేసే పనిని తక్కువ మందితో చేసే సౌకర్యం కృత్రిమ మేధ కల్పిస్తోంది. తాజాగా ఏఐ ఆధారంగా పనిచేసే గోల్డ్ లోన్ ఏటీఎం అందుబాటులోకి రావడం విశేషం.
ఇండియాలోనే తొలి గోల్డ్ లోన్ ఏటీఎం ను వరంగల్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎం.వి.రావు శుక్రవారం (మార్చి7) ఏటీఎంను లాంచ్ చేశారు. ఈ ఏటీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్ లో ఇది గేమ్ ఛేంజర్ ఇన్నోవేషన్ కానుందని ఈ సందర్భంగా ఎం.వి.రావు తెలిపారు.
గోల్డ్ లోన్ ను కేవలం 10 నుంచి 12 నిమిషాలలో ప్రాసెస్ చేస్తుంది ఈ ఏటీఎం. ఆధార్, మొబైల్ నంబర్ వెరిఫికేషన్ చేసి చాలా తొందరగా గోల్డ్ లోన్ ప్రాసెస్ చేస్తుంది ఈ ఏఐ ATM.
ATM ఎలా పనిచేస్తుందంటే..
ఏటీఎం మెషిన్ లో బంగారు ఆభరణాలు వేసినపుడు వాటి క్వాలిటీ, బరువును అంచనా వేస్తుంది. బంగారం క్వాలిటీని బట్టి ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా పేమెంట్ చేస్తుంది. చాలా కచ్చితమైన లెక్కలతో ఇది ఆభరణాలను కొలుచి పేమెంట్ చేస్తుందని అంటున్నారు.
ఏటీఎం మెషీన్ లో వేసిన బంగారాన్ని తూచిన తర్వాత 10 శాతం అమౌంట్ ను క్యాష్ రూపంలో ఏటీఎంలో అప్పటికప్పుడే చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అయితే వినియోగదారులు సెంట్రల్ బ్యాంకు ఖాతాదారులై ఉండాలి.
బ్యాంక్ సిబ్బందితో పాటు కస్టమర్స్ సమయాన్ని ఆదా చేసుందుకు ఈ ఏటీఎం ఉపయోగపడుతుంది. అదే విధంగా గోల్డ్ లోన్ గురించి అధికారులపై ఆధారపడకుండా, ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఈ టెక్నాలజీ ఏటీఎం ఉపకరిస్తుంది. ఇది సక్సెస్ అయితే దేశంలోని అన్ని బ్రాంచులలో ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎం.వి.రావు తెలిపారు.