భద్రాద్రికొత్తగూడెం జిల్లా సర్కారు స్కూళ్లలో ఏఐ టీచింగ్​

  భద్రాద్రికొత్తగూడెం జిల్లా సర్కారు స్కూళ్లలో ఏఐ టీచింగ్​
  • పైలట్​ ప్రాజెక్ట్ లో 6 ప్రైమరీ స్కూళ్లు
  • ప్రారంభించిన జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

భద్రాచలం,వెలుగు :   సర్కారు స్కూళ్లలో ఏఐ( ఆర్టిఫిషియల్​ ఇంటిలిజెన్స్) ద్వారా టీచింగ్​కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్​ ప్రాజెక్టులో భాగంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం తాతగుడి సెంటర్​, బూర్గంపాడు, అంజనాపురం, మోరంపల్లి బంజర, నాగినేనిప్రోలు, సారపాక గాంధీనగర్​ ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేయగా.. జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ సోమవారం ఈ టీచింగ్​ను ప్రారంభించారు.  

3,4,5 క్లాస్​ స్టూడెంట్లు తెలుగు బాగా చదివేలా, మ్యాథ్స్ లో పట్టుసాధించేలా చూడటం ఈ ప్రోగ్రాం ఉద్దేశం. బెంగళూరుకు చెందిన ఏక్​ స్టెప్​ అనే సంస్థతో తెలంగాణ సర్కారు అగ్రిమెంట్ చేసుకుంది. ఈ సంస్థ తమిళనాడులో చేపట్టిన ప్రోగ్రాం సక్సెస్​ అయ్యిందని అధికారులు 
తెలిపారు. 

వెనుకబడిన స్టూడెంట్లకు...

3,4,5 క్లాసుల్లో వెనుకబడిన ఐదుగురు స్టూడెంట్లతో ఒక బ్యాచ్​ను ఎంపిక చేస్తారు. ఒక్కో బ్యాచ్​కు తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 20 నిముషాల వ్యవథిలో ఏఐ ద్వారా కంప్యూటర్లో టీచ్​  చేస్తారు. ఇందుకు ప్రతీ అరగంటకు ఒక బ్యాచ్​ చొప్పున స్పెషల్ క్లాసులు ఉంటాయి. ప్రతీ స్టూడెంట్​ పై ప్రత్యేక శ్రద్ధ చూపి వారి  సామర్ధ్యాలను పెంచుతారు.

ఈ మేరకు ఆయా పాఠశాలల పరిధిలోని పేరెంట్స్ తో మీటింగ్​ నిర్వహించి వారి సాయం కూడా తీసుకుంటున్నారు. ఇంటి వద్ద కూడా పిల్లలను చదివించేలా వారికి కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ భద్రాచలంలోని తాతగుడి సెంటర్లోని ప్రైమరీ స్కూళ్లో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్​లో దిశా నిర్ధేశం చేశారు. టీచర్లు, పేరెంట్స్ సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఈ స్కీం విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు.