కేసీఆర్​ది లూటీ సర్కార్..5 లక్షలకోట్ల అప్పులు చేసిండు: మల్లికార్జున ఖర్గే

కేసీఆర్​ది లూటీ సర్కార్..5 లక్షలకోట్ల అప్పులు చేసిండు: మల్లికార్జున ఖర్గే
  • మిగులు రాష్ట్రాన్ని ఇస్తే.. రూ.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసిండు: మల్లికార్జున ఖర్గే
  • కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్కామ్​ .. బీఆర్​ఎస్​​కు గుణపాఠం చెప్పాలి
  • మోదీ, కేసీఆర్​ ఒక్కటై కాంగ్రెస్​ను భయపెట్టాలని చూస్తున్నరని వ్యాఖ్య
  • బంగారు తెలంగాణ అని చెప్పి బెల్టుషాపుల తెలంగాణ చేసిండు: రేవంత్​
  • సంగారెడ్డి, మెదక్ ఎన్నికల సభల్లో ప్రసంగం

మెదక్/సంగారెడ్డి, వెలుగు: తెలంగాణ బిడ్డల ఆకాంక్షను అర్థం చేసుకొని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే సీఎం అయిన కేసీఆర్​ మాత్రం కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘తెలంగాణ రాగానే  సోనియమ్మ ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కిన కేసీఆర్ ఫ్యామిలీ.. ఇప్పుడు రాహుల్, ప్రియాంక గాంధీపై విమర్శలు చేస్తున్నరు. మిగులు బడ్జెట్​ ఉన్న తెలంగాణను అప్పజెప్తే కేసీఆర్​ రూ.5లక్షల కోట్ల అప్పుల కుప్పను చేసిండు’’ అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి, మెదక్​ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన రోడ్​ షోలు, సభల్లో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ,  సీఎం కేసీఆర్​ ఇద్దరూ ఒక్కటై కాంగ్రెస్​ను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తాము ఎవరికీ భయపడబోమని అన్నారు. 

‘‘బీజేపీ ఏ టీమ్​ అయితే దానికి​ బీఆర్​ఎస్ బీ టీమ్” అని దుయ్యబట్టారు. గతంలో మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయిన ఇందిరా గాంధీ మెదక్ జిల్లాలో బీహెచ్ఈఎల్​, బీడీఎల్​, ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ లు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని, ప్రస్తుత మోదీ ప్రభుత్వం అలాంటి ఫ్యాక్టరీలను అమ్మాలని చూస్తున్నదని, దానికి సీఎం కేసీఆర్​ సపోర్ట్​ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో లూటీలు తప్ప గరీబులకు ఎలాంటి లాభం లేదని తెలిపారు. లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ‘‘ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి, కేసీఆర్​కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్​ ఐదు గ్యారెంటీలు ప్రకటిస్తే నాలుగింటిని అమలు చేసిందని, మరో గ్యారంటీని నవంబర్​లో అమలు చేస్తుందని తెలిపారు.  తెలంగాణలోనూ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలుచేసి తీరుతామని ఖర్గే స్పష్టం చేశారు.

నన్ను కొనేటోడు ఈ భూమ్మీద పుట్టలేదు: రేవంత్​

‘‘సీఎం కేసీఆర్​నన్ను రేటెంత రెడ్డి అంటున్నడు.. నేను రాష్ట్రాన్ని కోఠిలో అమ్ముతానట.. కేసీఆర్​ ఓ కచరా.  జుమ్మెరాత్​ బజార్​లో అగ్వకు తెలంగాణను అమ్మిన కేసీఆర్​.. నన్ను రేటెంత రెడ్డి అంటడా’’ అని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఫైర్​ అయ్యారు. తనను కొనెటోడు ఈ భూమ్మీద పుట్టలేదని అన్నారు. ‘‘బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్​.. రాష్ట్రంలో మూడు వేల వైన్​షాప్​లు, 1,800 బార్​లు, 62 వేల బెల్ట్​ షాప్​లు పెట్టించి బెల్ట్​ షాపుల తెలంగాణ చేసిండు” అని విమర్శించారు. ‘‘పునాదులు సక్కగ కట్టక మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే బాంబులు పెట్టి పేల్చారంటున్నరు.. బాంబులు పెడితే ఎక్కడికక్కడ పేలిపోతుంది కానీ భూమిలోకి కుంగిపోతుందా..?’’ అని ఆయన ప్రశ్నించారు.

కుంగిపోయే ప్రాజెక్ట్​ లను కట్టిన కేసీ ఆర్​ను గొప్ప సైంటిస్ట్, ఇంజినీర్​ అంటూ కితాబిస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ‘‘బొక్కలేస్తే గాని సక్కగ కాడు” అని కేసీఆర్​ను ఉద్దేశించి మండిపడ్డారు. ‘‘తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీని ఓడించాలి.  తెలంగాణ ప్రజల కష్టాలు, బాధలు చూసే సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు ప్రకటించారు. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను చూపిస్తం రమ్మని అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సవాల్​ విసిరితే ఇక్కడి మంత్రులు కేటీఆర్​, హరీశ్ తోక ముడిచిన్రు. కర్నాటకకు వెళ్లడానికి బస్సు రెడీగా ఉంది.. ప్రగతి భవన్​ కు రావాల్నా, ఫామ్​ హౌస్​​కు రావాల్నా కేసీఆర్” అని రేవంత్​  రేవంత్​ రెడ్డి సవాల్​ విసిరారు.

రానున్న కాంగ్రెస్​ గవర్నమెంట్​లో జగ్గారెడ్డి కీలక పాత్ర పోషించనున్నారని, ఆయనను 50 వేలకు పైగా మెజారిటీతో గెలిపించాలని కోరారు. పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తి మంత్రి మల్లారెడ్డి అని, కబ్జాలు చేస్తూ  కోట్లు సంపాదిస్తున్నారని మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. ‘‘నన్ను ఓడగొట్టాలని హరీశ్​ రావు​ అంటున్నడు. ఇక్కడి దమ్మేంటో ఆయనకు ప్రజలు చూపెట్టాలి. హరీశ్​ రావు​ సంగారెడ్డిలో తిరుగుతరా.. చూస్త”అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.