
ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబ్ బెదిరింపు వచ్చింది. టేకాఫ్ అయిన ఎనిమిది గంటల తర్వాత సిబ్బందికి బెదిరింపు రావడంతో పైలట్లు వెనక్కి మళ్లించారు. ముంబై నుంచి న్యూ యార్క్ వెళ్తున్న బోయింగ్ 777 ఫ్లైట్ లో 303 మంది ప్రయాణికులు , 19 మంది సిబ్బందితో అజర్బైజాన్ మీదుగా వెళ్తుండగా బెదిరింపు కాల్ రావడంతో వెంటనే ముంబైకి తిరిగి వచ్చింది. ల్యాండింగ్ తర్వాత విమానాన్ని తనిఖీలు చేయగా ఫేక్ బెదిరింపు కాల్ గా గుర్తించారు ఎయిర్ పోర్ట్ అధికారులు.
విమానం ముంబై నుంచి మార్చి 10న తెల్లవారుజామున 2 గంటలకు ముంబై నుంచి బయలుదేరి ఉదయం 10.25 గంటలకు ముంబైకి తిరిగి వచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ మొత్తం జర్నీకి దాదాపు 15 గంటలు పడుతుంది.
ఈ విమానం మళ్లీ మార్చి 11 ఉదయం 5 గంటలకు బయలుదేరుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. అప్పటి వరకు ప్రయాణీకులకు హోటల్ వసతి, భోజనం అసౌకర్యం కల్గకుండా ఏర్పాట్లు చేశామని వెల్లడించింది.