
- హనుమకొండలో 100 దాటుతున్న పీఎం10 లెవల్స్
- డంప్ యార్డు ఎఫెక్ట్ తో మడికొండ చుట్టుపక్కలా ప్రమాదకర స్థితి
- ఇండస్ట్రీలు, వాహన ఉద్గారాలు, పొగ కారణమంటున్న ఆఫీసర్లు
- బీ అలెర్ట్ అంటున్న పర్యావరణ వేత్తలు
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో ఎయిర్ క్వాలిటీ పడిపోతోంది. ఇండస్ట్రీలు సరైన ప్రమాణాలు పాటించకపోవడం, పెట్రోల్, డీజిల్ వెహికల్స్ నుంచి వెలువడే కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే కన్ స్ట్రక్షన్ వ్యర్థాలు, చెత్తను ఎక్కడికక్కడ తగులబెడుతుండటం వల్ల కూడా గాలి నాణ్యత దెబ్బతింటోంది. ఫలితంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)లో పీఎం10, పీఎం2.5 లెవెల్స్పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డంపింగ్ యార్డు ఎఫెక్ట్ఉన్న మడికొండ, రాంపూర్చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ దెబ్బతినగా, వాయు కాలుష్యంతో అక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
గాడితప్పుతున్న గాలి నాణ్యత..
వరంగల్ నగరం రాష్ట్ర రెండో రాజధానిగా డెవలప్ అవుతుండటంతో ఇండస్ట్రీస్ ఏర్పడుతున్నాయి. ఆఫీసులు, విద్య, ఉద్యోగ, ఉపాధి పనులు, ఇతర అవసరాల కోసం సిటీకి వచ్చే వెహికల్స్ లక్షల్లోనే ఉంటున్నాయి. వాటి నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, అమ్మోనియా, తదితర కాలుష్య కారకాలతో ఎయిర్ క్వాలిటీ దెబ్బతింటోంది. సిటీలో ప్రతి నెలా ఎయిర్ క్వాలిటీని టెస్టు చేసేందుకు వరంగల్ మీసేవ, హనుమకొండలోని కుడా ఆఫీస్, బాలసముద్రంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్, నక్కలగుట్ట ఈసేవ కేంద్రాల వద్ద శాంప్లింగ్ టెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి నెలా పీసీబీ ఆధ్వర్యంలో వాటిని మానిటర్ చేస్తుండగా, సమ్మర్ సీజన్ వచ్చిందంటే పార్టిక్యులేట్ మేటర్ (పీఎం) లెవల్స్ మారిపోతున్నాయి.
సాధారణంగా పీఎం10 లెవెల్స్ 60 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాల్సినప్పటికీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే నక్కలగుట్ట శాంప్లింగ్ స్టేషన్లో పీఎం10 లెవల్స్ 100 దాటుతున్నాయి. పీఎం10 లెవెల్స్ వంద దాటితే ఊపిరితిత్తులతోపాటు హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మిగతా చోట్లా పీఎం10 లెవల్స్ 60 నుంచి 100 లోపే ఉండగా, పెద్దగా సమస్యలు ఉండవని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు.
మడికొండలో డేంజర్ బెల్స్..
సిటీ వ్యాప్తంగా సీజన్ ను బట్టి పీఎం10, పీఎం2.5 లెవెల్స్లో హెచ్చుతగ్గులు ఉంటుండగా, డంప్యార్డు ప్రభావిత గ్రామాల్లో వాటి లెవెల్స్చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డంప్యార్డు నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి కారణంగా మడికొండ, రాంపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ చాలా పూర్ గా ఉంటోంది. ఇటీవల డంప్యార్డును తరలించాలని స్థానికులు ఆందోళనకు దిగగా, జీడబ్ల్యూఎంసీకి చెందిన ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేశారు.
ఈ క్రమంలో అక్కడి ఎయిర్ క్వాలిటీని చెక్ చేయగా, పీఎం2.5 లెవెల్స్ సగటున 243 మైక్రోగ్రామ్స్చూపించింది. సెంట్రల్పొల్యూషన్ కంట్రోల్బోర్డు నార్మ్స్ ప్రకారం పీఎం2.5 లెవెల్స్ఏడాదికి సగటున 40 మైక్రోగ్రామ్స్పర్ క్యూబిక్మీటర్ ఉండాలి. మడికొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో 200దాటి చూపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్కడి ప్రజల్లో చాలావరకు శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఇప్పటికే ఆస్తమా బారిన కూడా పడ్డారు. ఈనేపథ్యంలోనే అక్కడి ప్రజలు డంపింగ్ యార్డును తరలించాలని నెల రోజులుగా ఉద్యమం కొనసాగిస్తున్నారు.
కంట్రోల్ చేయకపోతే ముప్పే..
వాహనాలు, ఇండస్ట్రీలు, కన్స్ట్రక్షన్స్ తదితర కారణాల వల్ల కాలుష్యం పెరిగిపోతుండటం కలవరానికి గురి చేస్తుండగా, మున్ముందు సమస్య ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాలుష్య నియంత్రణకు చర్యలు నామమాత్రంగా కూడా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ చెట్లను నరికివేస్తుండగా, రోజురోజుకు పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా తొందర్లోనే హైదరాబాద్ తర్వాత వరంగల్ కూడా కాలుష్య నగరాల జాబితాలో చేరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య నియంత్రణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తుకు ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలి..
డంప్ యార్డు వల్ల మడికొండ, రాంపూర్చుట్టుపక్కల వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ఈ మధ్య టెస్టు చేసిన ఆఫీసర్లు కూడా అదే చెప్పారు. పొగ, దుమ్ము, ధూళి వల్ల మా గ్రామంలో చాలామంది శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. డంప్ యార్డు సమస్యకు తొందరగా పరిష్కారం చూపి, కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలి.
దువ్వ నవీన్, మడికొండ గ్రామస్తుడు