
న్యూఢిల్లీ: ఎక్కువ వడ్డీ పడుతున్న స్పెక్ట్రమ్ బకాయిలలో మరో రూ.5,985 కోట్లను భారతి ఎయిర్టెల్, దాని సబ్సిడరీ భారతి హెక్సాకామ్ డ్యూ డేట్కు ముందే చెల్లించాయి. 2024 వేలంలో 8.65 శాతం వడ్డీకి పొందిన పూర్తి స్పెక్ట్రమ్ బకాయిలను డ్యూ డేట్ కంటే ముందుగానే కట్టేశాయి. ఎయిర్టెల్ సబ్సిడరీ నెట్వర్క్ ఐ2ఐ లిమిటెడ్ కూడా బిలియన్ డాలర్ల (రూ.8,700 కోట్ల) విలువైన బాండ్లను రిడీమ్ చేసుకుంది.
అంటే ఇన్వెస్టర్లకు వడ్డీ చెల్లించి, వారి నుంచి బాండ్లను తిరిగి కొనుగోలు చేసుకుంది. అధిక వడ్డీ పడుతున్న రూ.25,981 కోట్ల విలువైన స్పెక్ట్రం బకాయిలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డ్యూడేట్కు ముందుగానే ఎయిర్టెల్ చెల్లించింది. మొత్తంగా ఇప్పటివరకు రూ. 66,665 కోట్ల స్పెక్ట్రం బకాయిలను క్లియర్ చేసింది.
కాగా, వీటిపై సగటును 9.74 శాతం వడ్డీని కట్టింది. ఎయిర్టెల్ 10 శాతం, 9.75 శాతం, 9.3 శాతం వడ్డీ పడుతున్న బకాయిలను ముందుగా చెల్లించింది. బకాయిల చెల్లింపు డెడ్లైన్ కంటే ఏడేళ్లు ముందుగానే చెల్లింపులు జరపడం విశేషం. షెడ్యూల్ డేట్లలో చెల్లిస్తే కంపెనీ రూ. 1,16,405 కోట్లను కట్టాల్సి ఉండేది.