రాష్ట్రాన్ని లూటీ చేసినోళ్లను మళ్లీ పీఠం ఎక్కనివ్వం : అక్బరుద్దీన్​ ఒవైసీ

రాష్ట్రాన్ని లూటీ చేసినోళ్లను మళ్లీ పీఠం ఎక్కనివ్వం : అక్బరుద్దీన్​ ఒవైసీ
  • రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటం.. కానీ, మా సమస్యలు పరిష్కరించాలి: అక్బరుద్దీన్​ ఒవైసీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని లూటీ చేసిన గత పాలకులు మళ్లీ పీఠమెక్కకుండా చూస్తామని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్​ఒవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని.. కానీ, తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. మహవీర్​ జయంతికి ప్రభుత్వ సెలవు ఇవ్వాలని, సిటీలో అతిపెద్ద గుడి అయిన లాల్​దర్వాజ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. హిందూత్వం, సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్లు ఏనాడూ దాని గురించి పట్టించుకోలేదన్నారు. 

హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వాళ్లు ఏనాడూ ఎండోమెంట్​ ల్యాండ్స్​ గానీ.. హిందువుల కోసం గానీ కొట్లాడలేదన్నారు. తాము కేవలం ముస్లింల కోసమే పనిచేయమని, హిందువుల కోసం కూడా పోరాడుతామని అక్బరుద్దీన్​స్పష్టం చేశారు. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మైనారిటీ రెసిడెన్షియల్​స్కూళ్లకు సంబంధించి తొమ్మిది నెలలుగా కిరాయి కట్టలేదని, మూడు నెలల బకాయిలైనా చెల్లించాలన్నారు. 

డ్రగ్స్​ కట్టడికి పోలీస్​ ఔట్​పోస్టులు ఏర్పాటు చేయాలి

డ్రగ్స్​ను కట్టడి చేసేందుకు స్లమ్ ఏరియాల్లో పోలీస్​ ఔట్​పోస్టులు ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్​ కోరారు. ఈ సమస్య పేదలు ఎక్కువగా ఉండే బస్తీల్లోనే ఉందన్నారు. స్కూళ్ల పక్కన ఉండే పాన్​షాపుల్లోనూ గంజాయి విక్రయాలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలన్నారు. స్కాలర్​షిప్పుల్లో కొన్ని మార్పులు చేయాలని అక్బరుద్దీన్​ సూచించారు. కొన్ని కోర్సుల్లో విద్యార్థులు ఓ వైపు ఫీజు రీయింబర్స్​మెంట్​తీసుకుంటూనే.. నెలనెలా స్టైపెండ్​ పొందుతున్నారని, ఈ రెండు కలిపితే లక్షల్లో అవుతుందని చెప్పారు. ఇలాంటి వాటిని మార్చాలన్నారు.