
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ జిల్లాలో సంక్షేమ పథకాల కోసం అర్హులు చేసుకున్న దరఖాస్తులన్నీ నెలల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి. లాక్డౌన్ రిలాక్సేషన్తో అందుతాయనుకున్నా నిరీక్షణ తప్పడం లేదు. అప్రూవల్ పూర్తయిన వాటికీ ఆర్థిక సాయం అందలేదు. జనతా కర్ఫ్యూకు ఒకటీ, రెండు నెలల ముందు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఫుడ్సెక్యూరిటీ కార్డు, ఆసరా పింఛన్లతోపాటు క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్, ఓబీసీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వేలల్లో ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగంలో వారం క్రితం వరకూ 33శాతం మంది ఆఫీసుల్లో డ్యూటీ చేయగా, మిగిలిన వాళ్లు కరోనా డ్యూటీల్లో ఉండిపోయారు. మరోవైపు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ఆలస్యం అవుతోంది.
చెక్కులు ఎప్పుడొస్తాయా అని..
హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 16 మండలాల నుంచి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్లో కల్యాణలక్ష్మి 1,687, షాదీ ముబారక్ 2,785, సికింద్రాబాద్ డివిజన్ లో కల్యాణ లక్ష్మి 1,245, షాదీ ముబారక్ 568 అప్లికేషన్లు ఆర్డీవోలు పరిశీలించి అప్రూవ్ చేశారు. ఫండ్ మాత్రం రిలీజ్ కాలేదు.
ఆసరా కోసం..
ఆసరా పథకానికి అర్హుల వయస్సు 57 ఏండ్లకు తగ్గించిన నేపథ్యంలో వృద్ధాప్య పింఛన్ల కోసం దాదాపు 5వేల అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో అప్రూవల్ పొందిన వారికి కూడా ఇవ్వకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2 నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో వచ్చే నెలలో అయినా పింఛన్డబ్బులు అందుతాయో, లేదోనన్న ఆందోళనలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఉన్నారు.
కార్డుల జారీ లేదు..
జిల్లాలో కొత్త కార్డుల కోసం 70,277 దరఖ్తాసులు పెండింగ్లో ఉన్నాయి. లాక్డౌన్తో జారీ నిలిచిపోయింది. ఉన్న కార్డులను డిలీట్చేయించుకొని కొత్తకార్డుల కోసం దరఖాస్తు అప్లై చేసుకున్నవారు ఏదీ లేకపోవడంతో రేషన్ కోల్పోతున్నారు. ప్రస్తుతం ఆఫీసులు పూర్తి స్థాయిలో కొనసాగుతుండడం, సిబ్బంది 100శాతం వస్తుండడంతో కార్డుల కోసం దరఖాస్తుదారులు వచ్చి పోతున్నారు.
కలెక్టర్కు కంప్లయింట్స్
అప్లికేషన్ల ఆలస్యంపై పలువురు కలెక్టర్ శ్వేతామహంతికి ట్విట్టర్లో కంప్లయింట్ చేశారు. షాదీ ముబారక్ మీద ఓ వ్యక్తి ట్వీట్ చేయగా, డబ్బు మంజూరైనట్లు బ్యాంకు నుంచి ఆర్డీవోకు చెక్కు అందలేదని, రాగానే అందిస్తామని కలెక్టర్ రీ ట్వీట్చేశారు. పింఛన్కు అప్లై చేసుకున్నా మంజూరు కాలేదని సైదాబాద్కు చెందిన మరొకరు ట్వీట్ చేయగా, ఆధార్ నంబర్ పంపాలని సూచించారు. ఇలా చాలామంది దరఖాస్తుదారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నారు.
పెండింగ్లో ఉన్నవి
స్కీం అప్లికేషన్లు
ఫుడ్ సెక్యూరిటీ కార్డులు -70,277
కల్యాణలక్ష్మి, షాదీముబారక్- 6,285
ఆసరా పింఛన్లు -5,000
త్వరలోనే పరిష్కరిస్తం
అన్ని అప్లికేషన్లు త్వరలోనే పరిష్కరిస్తం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధదారులకు చెక్కులు కూడా అందిస్తం. కరోనా, రెవెన్యూ సిబ్బందికి లాక్డౌన్ డ్యూటీలు పడడం వల్ల లేట్ అయింది. ప్రస్తుతం 100 శాతం ఎంప్లాయీస్ వస్తున్నరు. ‑ అనిల్, డీఆర్వో
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి