
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) డిప్లొమా, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినుల కోసం స్కాలర్షిప్పులు అందజేస్తుంది. ప్రగతి పేరుతో ఏటా పదివేల మందికి వీటిని కేటాయిస్తుంది.
అర్హత : డిప్లొమా లేదా ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్, లేటరల్ ఎంట్రీలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ కోర్సుల్లో చేరినవారు ఏఐసీటీఈ అందించే ప్రగతి స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. కుటుంబం నుంచి ఇద్దరు బాలికలు మాత్రమే ఈ స్కాలర్షిప్పులకు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
సీట్లు : డిప్లొమా స్థాయిలో 5000 మందికి, డిగ్రీ (ఇంజినీరింగ్)లో 5000 మందికి వీటిని అందిస్తారు. ఎంపికైతే ఏడాదికి రూ.యాభై వేలు చొప్పున డిప్లొమా వాళ్లకు మూడేళ్లు, ఇంజినీరింగ్ చేస్తుంటే నాలుగేళ్లు చెల్లిస్తారు. లేటరల్ ఎంట్రీలో చేరినవారికి డిప్లొమా అయితే రెండేళ్లు, ఇంజినీరింగ్ అయితే మూడేళ్లపాటు ఇవి అందుతాయి. దేశవ్యాప్తంగా అందించే ఈ స్కాలర్షిప్స్ కోసం ఇంజినీరింగ్ విభాగంలో తెలంగాణ నుంచి 424 మందికి, డిప్లొమా విద్యార్థినుల్లో తెలంగాణలో 206 మందికి వీటిని అందిస్తారు.
సెలెక్షన్ : డిప్లొమా అభ్యర్థులైతే పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా వీటికి ఎంపిక చేస్తారు. పదో తరగతికి డిప్లొమాలో చేరడానికి మధ్య రెండేళ్ల కంటే ఎక్కువ వ్యవధి ఉండరాదు. ఇంజినీరింగ్లో చేరినవారైతే ఇంటర్ మార్కులు పరిగణనలోకి తీసుకుని స్కాలర్షిప్పులు కేటాయిస్తారు.
దరఖాస్తులు : ఆన్లైన్లో డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.scholarships.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.