- లిక్కర్ సేల్స్..రూ. 30 వేల కోట్లు
- అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.6,822 కోట్ల సేల్స్
- ప్రతినెల రూ.2,500 కోట్లకు పైనే లిక్కర్ తాగుతున్రు
- ఏటేటా పెరుగుతూనే ఉన్న అమ్మకాలు.. ఏడేండ్లలో మూడింతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోంది. లిక్కర్ అమ్మకాలు ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. 2021– 22 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ సేల్స్ ఏకంగా రూ.30 వేల కోట్లు క్రాస్ అయ్యాయి. గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ (శనివారం) వరకు రూ.30,086 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేశారు. ఇందులో 3.62 కోట్ల ఇండియన్ మేడ్ ఫారిన్లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) కేసులు, 3.35 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. అంటే సగటున నెలకు రూ.2,500 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.26,632 కోట్ల లిక్కర్ మాత్రమే సేల్ అయ్యింది. అంటే గతంలో కంటే రూ.3,454 కోట్ల విలువైన లిక్కర్ ఎక్కువగా అమ్ముడైంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.6,700 కోట్ల మద్యం అమ్మారు.
మరో 4 వేల కోట్ల లిక్కర్ తాగించేలా..
తెలంగాణ వచ్చినంక 2014లో రూ.10,880 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడైంది. ఆ తర్వాత ఏటా మద్యం సేల్స్ పెరుగుతున్నాయి. 2018 నాటికి రూ.20,850 కోట్లకు పెరిగాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.27,280 కోట్లకు పెరగడం గమనార్హం. ఇక ఈసారి ఏకంగా 30 వేల కోట్లు క్రాస్ అయ్యింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4వేల కోట్లు అదనంగా రాబట్టేందుకు సర్కారు టార్గెట్ పెట్టుకోవడం విశేషం.
రంగారెడ్డి టాప్
ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 వైన్స్తోపాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లున్నాయి. మద్యం అమ్మకాల్లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లోనే వాటా ఎక్కువ ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనే 10 వేల కోట్లకు పైగా సేల్స్ జరిగాయి. రంగారెడ్డి 6,822 కోట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. తర్వాత హైదరాబాద్ 3,150 కోట్లు, నల్గొండలో 3,222 కోట్లు, వరంగల్ అర్బన్లో 2,673 కోట్లు, మెదక్లో 2,390 కోట్లు, కరీంనగర్లో 2,270, మహబూబ్నగర్లో 2,240 కోట్ల విలువైన లిక్కర్ తాగారు. ఇక అత్యల్పంగా నాగర్కర్నూల్ జిల్లాలో 8.99 కోట్లు ఉండగా, రూ.10.91 కోట్లతో గద్వాల, 11.40 కోట్లతో జనగామ చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
డిసెంబర్లో తాగుడే తాగుడు
2021– 22 ఆర్థిక సంవత్సరంలో మరో ఆల్టైం రికార్డు నమోదైంది. ఒకే నెలలో ఎక్కువ మొత్తం సేల్స్ కొనసాగించిన నెలగా డిసెంబర్ నిలిచింది. ఈ నెలలో ఏకంగా రూ.3,459 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి సరఫరా అయ్యింది.
పుంజుకున్న బీరు సేల్స్
రాష్ట్రంలో 2014లో 2.01 కోట్ల కేసుల లిక్కర్, 3.12 కోట్ల కేసుల బీర్లు సేల్ అయ్యాయి. రెండేండ్లుగా సీన్ రివర్స్ అయింది. లిక్కర్ సేల్స్ పెరిగి, బీరు అమ్మకాలు తగ్గాయి. కరోనా భయానికితోడు ధరలు రెండు సార్లు పెంచడంతో బీరు సేల్స్ పడిపోయాయి. ఇటీవల ఆబ్కారీ శాఖ బీరుపై రూ.10 తగ్గిండం, కరోనీఆ తగ్గడంతో బీరు అమ్మకాలు పెరిగిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 3.35 కోట్ల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.
బార్లు పెంచి.. టైం పెంచి.. ధరలు పెంచి..
ఆదాయం సమకూర్చుకునేందుకు సర్కారు అన్ని మార్గాలను వెతుకుతోంది. ఎప్పటికప్పుడు మద్యం ధరలు పెంచుతోంది. వైన్స్, బార్ల వేళలను పెంచింది. గతంలో వైన్స్ ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూసివేసేవాళ్లు. ప్రస్తుతం హైదరాబాద్లో 11 గంటల దాకా టైం పొడిగించారు. సాధారణ రోజుల్లో బార్ల క్లోజింగ్ టైం రాత్రి 12 గంటలకు ఉంటే.. హైదరాబాద్లో మాత్రం శుక్ర,శని, ఆదివారాల్లో ఒంటి గంట వరకు పెంచారు. గతంలో 1,052 బార్లు ఉండగా.. మరో 159 బార్లకు అనుమతిచ్చింది. ఇటీవల మరో 409 వైన్స్కు పర్మిషన్ ఇచ్చారు.