వాళ్ళు ముంబైకే పరిమితం అయ్యారు: అల్లు అరవింద్

వాళ్ళు ముంబైకే పరిమితం అయ్యారు: అల్లు అరవింద్

టాలీవుడ్ లో పలు హిట్ చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమే. అల్లు అరవింద్ టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ తదితర స్టార్ హీరోలు నటించిన హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కాగా తాజాగా అల్లు అరవింద్ నార్త్ సినిమాల మేకింగ్ విధానంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇందులో భాగంగా తాను బాలీవుడ్ సినిమాల దర్శక నిర్మాతలని గౌరవిస్తానని కానీ వారు ఎక్కువగా ముంబైలోని బాంద్రా, జుహూ వంటి ప్రాంతాలకే ఎక్కువగా పరిమితం అయ్యారని చెప్పుకొచ్చాడు ఈ క్రమంలో సౌత్ ప్రేక్షకులను ఆకర్షించడంలో కొంతమేర ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ తో పలు సౌత్ సినిమాలు నార్త్ ఇండియాలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్లు సాధిస్తున్నాయని ఇది చాలా మంచి అంశమని పేర్కొన్నాడు. దీనికితోడు ఇప్పటికే చాలామంది దర్శకనిర్మాతలు ఏ సినీ పరిశ్రమ అయినా 3 లేదా 4 భాషల్లో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేస్తూ ఆడియన్స్ ని బాగానే అలరిస్తున్నారని చెప్పుకొచ్చాడు.

ఈ కారణంగా భారదేశంలోని టాలీవుడ్, తమిళ్, మలయాళీ, కన్నడ అలాగే ఇతర సినీ పరిశ్రమల్లోని సినీ నిర్మాతలు ప్యాన్ ఇండియా చిత్రాలు నిర్మించడానికి ముందుకొస్తున్నారని దీంతో సినీ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు.