అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త. సాధారణంగా హిమాలయాల్లో యాత్ర అనే మాట వినగానే అమర్ నాథ్ యాత్రే గుర్తుకు వస్తుంది. అమర్ నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుంది. సాక్షాత్తు పరమశివుడిని దర్శించుకునేందుకు హర..హర మహాదేవ అంటూ భక్తులు ఈ యాత్రను చేస్తారు.అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది.
ఈ ఏడాది జూన్ 29 అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు. యాత్రలో భద్రతాపరమైన విషయాలపై జమ్ముకశ్మీర్ యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే అమర్ నాథ్ యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ ప్రబుత్వం తాజాగా అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్ను విడుదల చేసింది. ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు.
దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఈ అమర్నాథ్ ఆలయం ఉంటుంది. అనంతనాగ్ జిల్లా పహల్గామ్, గండర్బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. www.jksasb.nic.in. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. అయితే 13 నుంచి 70ఏళ్ల మధ్యలో ఉన్న వారే ఈ యాత్ర చేయాలి. అయితే 6నెలల గర్భంతో ఉన్న మహిళలు కూడా యాత్రకు వెళ్లలేరు.
పలు భద్రతా ఏర్పాట్లు చేసిన తరువాతనే ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్ను విడుదల చేసింది 2024 అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 02:19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళుతుంటారు.
అమర్ నాథ్ దేవస్థాన బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాత్ర కు సంభందించిన పలు అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ ఏడాది దాదాపు 45 రోజుల పాటు మంచులింగ దర్శనానికి అవకాశమివ్వనున్నారు. యాత్ర కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15న ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వస్తారని బోర్డు అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. యాత్ర చేయబోయే ప్రతివారూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది.
యాత్రికులు తీసుకోవాల్సిన జాత్రత్త
- అమర్నాథ్ యాత్ర సమయంలో ఉష్ణోగ్రతలు 5డిగ్రీల కన్నా తక్కువకు పడిపోవచ్చు. అందువల్ల యాత్రికులు ఉన్నితో తయారు చేసిన దుస్తులను తెచ్చుకోవాలి.
- గొడుగు, హీటర్, రెయిన్కోట్, వాటర్ ప్రూఫ్ షూ తెచ్చుకోవాలి.
- వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులను వాటర్ ప్రూఫ్ బ్యాగుల్లో పెట్టుకోవాలి.
- ఐడీ కార్డులు, డ్రైవింగ్ లెసెన్సు, యాత్రకు అనుమతి పత్రాలు కచ్చితంగా ఉండాలి.
-
ఇవి చేయకూడదు..
- అమర్నాథ్ యాత్ర వేళ.. హెచ్చరికలు ఉన్న చోట ఆగకూడదు, వాహనాలు నిలపకూడదు.
- స్లిప్పరు వేసుకోకూడదు. ట్రెక్కింగ్ షూలు మాత్రమే ధరించాలి.
- షార్ట్ కట్స్తో కూడిన మార్గాల కోసం ప్రయత్నించకూడదు. అది ప్రమాదకరం. అమర్నాథ్ యాత్ర కోసం నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలి.
- కాలుష్యం, పర్యావరణం దెబ్బతినే విధంగా ఎలాంటి పనులు చేయకూడదు.
- ప్లాస్టిక్ను అస్సలు వినియోగించకూడదు. చట్టం ప్రకారం కఠిన శిక్షలు పడతాయి.