
ఊట్కూర్, వెలుగు: క్రీడా రంగానికి, క్రీడాకారులకు పూర్తి సహకారం అందిస్తానని అంబాత్రయ క్షేత్ర త్రిశక్తి పీఠం స్వామిజీ ఆదిత్యపరాశ్రీ తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సైక్లింగ్, ఖోఖో, షూటింగ్ బాల్ క్రీడాకారులకు రిటైర్డ్ పీఈటీ గోపాలం ఆధ్వర్యంలో అంబాత్రయ క్షేత్రంలో ఆదివారం ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేసి శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ త్రిశక్తి పీఠంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న గోపాలంను ఆయన అభినందించారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్న గోపాలం కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు రూప, దీప, శిల్ప, పుష్పను ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.