
హైదరాబాద్ సిటీ నెట్ వర్క్, వెలుగు: భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్జయంతిని సోమవారం గ్రేటర్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలు, కుల, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ ర్యాలీలు తీశారు. అన్నదానాలు చేశారు. అంబేద్కర్ అందరివాడు అని, కొన్నివర్గాలకే పరిమితం చేయొద్దని నినాదాలు చేశారు. తార్నాక డివిజన్ చింతలబస్తీలోని అంబేద్కర్విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, బీజేపీ నాయకులతో కలిసి కేంద్రమంత్రి కిషన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వికారాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి నివాళులర్పించారు.
లింగోజిగూడ నుంచి ఎల్బీనగర్అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఊరేగింపు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. ఎల్బీనగర్ కు చెందిన చిత్రకారుడు నాగార్జునపు రాము నోట్లో మార్కర్తో అంబేద్కర్ చిత్రాన్ని గీసి నివాళి అర్పించారు. వాటర్బోర్డు హెడ్డాఫీసులో ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్, జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్ ఇలంబరితి, ప్రేమ్ నగర్లో మేయర్ విజయలక్ష్మి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో సూటు బూటుతో బషీర్బాగ్ నుంచి ట్యాంక్బండ్వరకు జై భీమ్ ర్యాలీ నిర్వహించారు.
గిరిజన శక్తి ఆధ్వర్యంలో లంబాడీ సంప్రదాయ వస్త్రధారణతో బషీర్ బాగ్ జగ్జీవన్ రామ్విగ్రహం నుంచి ట్యాంక్బండ్విగ్రహం వరకు అంబేద్కర్ ఫొటోను ఊరేగించారు. బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో అంబేద్కర్జయంతిని ఘనంగా నిర్వహించారు. అరుణోదయ ఆఫీసులో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో విమలక్క, పీడీఎస్ యూ(విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి అల్లూరి విజయ్ పాల్గొన్నారు. గోల్కొండ పీఎస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు.