ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా అంబేద్కర్ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. ఊరు, వాడ, పల్లె, పట్టణాల్లో నీలి జెండాలు రెపరెపలాడాయి. పల్లె, పట్టణాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో అంబేద్కర్ ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై భీమ్, జై అంబేద్కర్ అన్న నినాదాలు మర్మోగాయి.
వేడుకల్లో ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, దళిత, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నాయకులు భారత రాజ్యాంగ సృష్టికర్త, దార్శనీకుడు అంబేద్కర్ ఫొటోలు, విగ్రహాలకు నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అసమానత్వాన్ని తొలగింపజేసి సమానత్వ పునాదులపై పీడిత ప్రజలను నిలిపిన మహానుబావుడు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆదర్శప్రాయుడు అంబేద్కర్ అని ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. - వెలుగు, నెట్వర్క్