అదానీ షేర్ల నుంచి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చడానికి కోటక్ ఆఫ్షోర్ ఫండ్ను సృష్టించినట్లు హిండెన్బర్గ్ ఆరోపించింది. అంతేగాక అదానీ షేర్లను షార్ట్ చేసినందుకు తమకు సెబీ నుంచి నోటీసు వచ్చిందని పేర్కొంది.సెబీ కోటక్ను రక్షించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
న్యూఢిల్లీ: అదానీ గ్రూపుపై పలు ఆరోపణలు చేసి తీవ్ర నష్టం కలిగించిన అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ఈసారి కోటక్బ్యాంకును టార్గెట్ చేసింది. బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్, మరో బ్రోకరేజీ కలిసి అదానీ షేర్లలో నష్టం నుంచి లాభం పొందడానికి ఆఫ్షోర్ ఫండ్ను సృష్టించారని ఆరోపించింది. అదానీపై తమ రిపోర్ట్ వచ్చాక ఇది జరిగిందని పేర్కొంది.
అదానీ గ్రూప్లో స్టాక్ మార్కెట్ అవకతవకలు, అకౌంటింగ్ మోసం, మనీలాండరింగ్ జరిగిందని జనవరి 2023 నివేదికలో హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. అప్పుడు షేర్లపై బెట్టింగ్ (షార్టింగ్)చేయడం వల్ల వచ్చిన లాభాలపై భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి షోకాజ్ నోటీసు అందిందని తెలిపింది. అదానీ గ్రూపు షేర్లపై షార్టింగ్ చేసినట్టు అప్పుడే తాము వెల్లడించామని, అలా చేయడం వల్ల నాలుగు మిలియన్ల డాలర్ల లాభం మాత్రమే వచ్చిందని ప్రకటించింది. అదానీ బాండ్ల ద్వారా 34 వేల డాలర్లు సమకూరాయని తెలిపింది. ఇదిలా ఉంటే హిండన్బర్గ్ కోటక్ బ్యాంక్ను ఈ వ్యవహారంలోకి లాగడంతో సంస్థ షేర్లు మంగళవారం రెండు శాతం నష్టపోయాయి.
మమ్మల్ని బెదిరించడానికే..
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) షోకాజ్ నోటీసును బెదిరింపు ప్రయత్నంగా పేర్కొంటూ, నోటీసులో కోటక్ పేరు ఎందుకు పెట్టలేదని హిండెన్బర్గ్ ప్రశ్నించింది. ఒక పెద్ద పారిశ్రామికవేత్తను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. తమ ఇన్వెస్టర్పార్ట్నర్ ఉపయోగించిన ఆఫ్షోర్ ఫండ్ను కోటక్బ్యాంక్ ఉపయోగించుకుందని స్పష్టం చేసింది. ‘కోటక్’ పేరును దాచిపెట్టడానికి సెబీ కేవలం ‘కే’ -ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ అని పేర్కొందని విమర్శించింది. కేఎంఐఎల్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అని వివరణ ఇచ్చింది. అదానీ షేర్లను షార్టింగ్చేసిన విషయాన్ని అప్పుడే బయటపెట్టామని పేర్కొంది.
అదానీకి తీవ్రనష్టం...
హిండెన్బర్గ్ జనవరి 2023 అదానీకి వ్యతిరేకంగా రిపోర్ట్ విడుదల చేయడంతో దాని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ అప్పుడు150 బిలియన్ల డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అదానీకి వ్యతిరేకంగా తాము చేసిన ఆరోపణలకు ఇప్పటికీ ఆ సంస్థ నుంచి జవాబులు రాలేదని పేర్కొంది. అయితే అదానీ గ్రూప్ పదేపదే హిండెన్బర్గ్ నివేదికను ఖండించింది. అదానీ షేర్ల నుంచి లాభం పొందడానికి "ఒక పెట్టుబడిదారు సంబంధం" నుంచి సాయం పొందామని పేర్కొంది కానీ పేరును వెల్లడించలేదు.
"బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ వ్యక్తిగతంగా సెబీ కార్పొరేట్ గవర్నెన్స్పై కమిటీకి నాయకత్వం వహించారు. కోటక్ లేదా మరే ఇతర కోటక్ బోర్డ్ మెంబర్ గురించి సెబీ ప్రస్తావన లేకపోవడం మరో శక్తివంతమైన భారతీయ వ్యాపారవేత్తను రక్షించడానికే అని మేము అనుమానిస్తున్నాం" అని హిండెన్బర్గ్ పేర్కొంది. హిండెన్బర్గ్పై కోటక్ కూడా మండిపడింది. కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ లిమిటెడ్కుగానీ, బ్యాంక్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ కింగ్డన్ క్యాపిటల్ మేనేజ్మెంట్కు హిండన్బర్గ్ అసలు క్లయింటే కాదని స్పష్టం చేసింది. తమ ఫండ్లో ఇన్వెస్టర్ కాదని వివరణ ఇచ్చింది.