
- ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- పెట్టుబడులతో ముందుకు
- రావాలని కంపెనీలకు ఆహ్వానం
- బయోటెక్ హబ్గా హైదరాబాద్ మరింత బలోపేతమౌతదని ధీమా
హైదరాబాద్, వెలుగు:అమెరికాలోనే అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ను ప్రారంభించింది. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని ఆమ్జెన్ కార్యాలయ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ఓపెన్ చేశారు. కార్యక్రమంలో సీఎం మాట్లా డుతూ..ఆమ్జెన్ విస్తరణతో హైదరాబాద్ బయోటెక్ హబ్ గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు.
‘‘గత ఏడాది ఆగస్టులో శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లినప్పుడు ఆమ్జెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించాను. ఔషధాలపై పరిశోధన, కొత్త ఔషధ ఆవిష్కరణల ద్వారా ప్రజల జీవితాలను మార్చేందుకు ఆమ్జెన్ చేస్తున్న ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నాను. మాతో భాగస్వామ్యం పంచుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగినంత సహకారం అందిస్తామని అప్పుడే ఆహ్వానించాను.
ప్రపంచంలోనే పేరొందిన బయో టెక్ కంపెనీ ఆమ్జెన్ ఇప్పుడు హైదరాబాద్లో ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయో-టెక్ రంగాల్లో అగ్రగామిగా ఉంది. ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించే లక్ష్యంతో తెలంగాణ అడుగులేస్తున్నది. చైనా ప్లస్ వన్ గమ్యస్థానంగా హైదరాబాద్ ను ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నది” అని తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందన్నారు. పరిశోధనలు, నైపుణ్యాల అభివృద్ధి, విద్యలో భాగస్వామ్యం పంచుకునే కార్యకమాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని ఆయన ఆహ్వానించారు.
ఆవిష్కరణలకు వేదిక: మంత్రి శ్రీధర్బాబు
ఆమ్జెన్ వంటి ప్రపంచ అగ్రగామి సంస్థలు రాష్ట్రానికి రావటం కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బయోటెక్, టెక్నాలజీ రెండింటి సమ్మిళితంగా ఆవిష్కరణలకు కొత్త వేదిక ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే హైదరాబాద్ వరల్డ్ బయో టెక్ హబ్గా మారుతుందని ఆయన ఆకాంక్షించారు.
కాగా, పేషెంట్లకు మెరుగైన సేవలందించడానికి, ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్తో పాటు సాంకేతికతను ఉపయోగించుకోవాలనే తమ ప్రయత్నంలో ఈ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం కొత్త మైలురాయిని సూచిస్తుందని ఆమ్జెన్ చైర్మన్, చీఫ్ ఎగ్జ్క్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ ఎ. బ్రాడ్వే అన్నారు. సంస్థ విస్తరణకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, ఆమ్జెన్ ఇండియా ప్రతినిధి సోమ్ చటోపాధ్యాయ, అమ్జెన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుల్లపల్లి పాల్గొన్నారు.
వినూత్న మెడిసిన్కు కేరాఫ్ ఆమ్జెన్
ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాల్లో ఆమ్జెన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఈ సంస్థలో 28 వేల మంది ఉద్యోగులున్నారు. ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన వ్యాధులకు, అలాంటి వాటి బారిన పడుతున్న లక్షలాది మందికి ఆరోగ్యం అందించేందుకు ఆమ్జెన్ వినూత్నమైన ఔషధాలను కనుక్కొని తయారు చేస్తున్నది. ఔషధాల శ్రేణిని మరింత అభివృద్ధి చేసేందుకు ఆమ్జెన్ హైదరాబాద్లో ఈ కొత్త సెంటర్ నెలకొల్పింది.
ఏఐ, డేటా సైన్స్ డిజిటల్ సామర్థ్యాలతో ఇన్నోవేషన్ సైట్ గా దీన్ని డెవలప్ చేస్తున్నది. 2025లో 200 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,600 కోట్లు) పెట్టుబడి పెడుతున్నది. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనుంది. దీంతో బయో ఫార్మా రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.