2026 టీ20 వరల్డ్ కప్‌కు సంజు శాంసన్‌ను ఎంపిక చేయరు: టీమిండియా మాజీ స్పిన్నర్

2026 టీ20 వరల్డ్ కప్‌కు సంజు శాంసన్‌ను ఎంపిక చేయరు: టీమిండియా మాజీ స్పిన్నర్

వరల్డ్ కప్ జట్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ టీ20 వరల్డ్ కప్ 2024 లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో తొలిసారి అతనికి వరల్డ్ కప్ లో స్థానం దక్కింది. అయితే ఐపీఎల్ లో సూపర్ ఫామ్ తో వరల్డ్ కప్ కు సెలక్ట్ అయినా.. ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. రిషబ్ పంత్ ప్రారంభ మ్యాచ్ ల్లో రాణించడంతో చివరి వరకు అతన్నే వికెట్ కీపర్ గా కొనసాగించారు. దీంతో శాంసన్ టోర్నీ మొత్తం బెంచ్ కే పరిమితమయ్యాడు. 

టాలెంట్ ఉన్నా భారత జట్టులో అవకాశాలు రావడం లేదనే పేరు సంజు శాంసన్ కు ఉంది. ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంజు శాంసన్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతన్ని 2026 టీ20 వరల్డ్ కప్ కు సెలక్ట్ చేయరని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇందుకుగాను కోహ్లీని ఉదాహరణగా చూపించాడు. శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్‌లో మిశ్రా మాట్లాడుతూ 2026 టీ 20 వరల్డ్ కప్ లో సంజు స్థానంపై అనుమానం వ్యక్తం చేశాడు. 

Also Read :- క్రికెట్‌లో టెన్నిస్ షాట్

"2026 టీ20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ కు చోటు దక్కుతుందని నేను భావించడం లేదు. దీనికి కారణం అతని వయసే.   టీమిండియాలో యువ వికెట్ బ్యాటర్లు చాలా మంది ఉన్నారు. యువ ఆటగాళ్లు ఈ ఫార్మాట్ లో బాగా రాణిస్తారు. శాంసన్ ఆడవలసి వస్తే అతను అసాధారణ ప్రదర్శన చేయాలి. ప్రతి మ్యాచ్ లో నిలకడాగా ఆడితేనే అతన్ని వరల్డ్ కప్ కు పరిగణిస్తారు. రిషబ్ పంత్ రెగ్యులర్ వికెట్ కీపర్ గా కొనసాగుతారు. ఇషాన్ కిషన్, ధృవ్ జురెల్, జితేష్ శర్మ ఈ రేస్ లో ఉన్నారు". అని మిశ్రా చెప్పుకొచ్చాడు.