కొమ్మూరి ప్రతాప్​రెడ్డి పద్ధతి మార్చుకోవాలి: సీపీఎం

కొమ్మూరి ప్రతాప్​రెడ్డి పద్ధతి మార్చుకోవాలి: సీపీఎం

చేర్యాల, వెలుగు: కాంగ్రెస్​లీడర్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​రెడ్డి అక్రమాలకు తెరలేపుతున్నారని సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని, చేర్యాల ప్రాంత సమస్యల పరిష్కారంపై ఫోకస్​పెట్టాలని సూచించారు. బుధవారం చేర్యాలలోని సీపీఎం ఆఫీసులో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. చేర్యాల పరిధి సర్వే నంబర్​984లోని ప్రతాప్​రెడ్డికి చెందిన 12.25 గుంటల భూమిని దేవాదుల కెనాల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని పరిహారం చెల్లించిందని గుర్తుచేశారు. 

అయితే ప్రతాప్​రెడ్డి తన పలుకుబడి ఉపయోగించి సదరు భూమిని తిరిగి ఆక్రమించారని, ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు వేసుకుని.. ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. చేర్యాల పెద్ద చెరువు స్థలం కబ్జా విషయంలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన కూతురు తుల్జాభవానిరెడ్డి, జితేందర్​రెడ్డి, మారుతి ప్రసాద్ తో ఎన్నికలకు ముందు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక, ప్రతాప్​రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చేర్యాల ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసి, తప్పుడు పద్ధతిలో గెలవాలని చూసిన ప్రతాప్​రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు నామినేటెడ్​పదవులను అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం నాయకులు వెంకట మావో, ఆలేటి యాదగిరి, కృష్ణారెడ్డి, రవికుమార్, అరుణ్​కుమార్, పి.శ్రీహరి, శోభ, ప్రభాకర్, శ్రీనివాస్, రంజిత్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.