ట్విట్టర్​ యూజర్లపై అమూల్ ఫిర్యాదు

ట్విట్టర్​ యూజర్లపై అమూల్ ఫిర్యాదు
  •  తిరుపతి లడ్డూలో ఆ కంపెనీ నెయ్యి ..
     వాడారని ప్రచారం చేసిన ఏడుగురిపై కేసు

అహ్మదాబాద్: తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో తమ నెయ్యి వాడారంటూ సోషల్​ మీడియాలో ప్రచారం చేసిన నెటిజన్లపై అమూల్​సంస్థ మండిపడింది. ఈ మేరకు పలువురు ట్విట్టర్​ యూజర్లపై గుజరాత్​లోని అహ్మదాబాద్​ సైబర్​క్రైం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. ఈమేరకు పోలీసులు ఏడుగురు యూజర్లపై ఎఫ్ఐఆర్​నమోదు చేశారు. నిందితులపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

 ఎఫ్ఐఆర్​ప్రకారం.. లడ్డూల తయారీకి ఉపయోగించే జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి అమూల్​ బ్రాండ్​కు చెందినదని ట్విట్టర్​లో ఏడు వేర్వేరు హ్యాండిల్స్​నుంచి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు. ఇది తమ ప్రతిష్టకు భంగం కలిగించిందని అమూల్​బ్రాండ్​తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్​ కోఆపరేటివ్​మిల్క్​మార్కెటింగ్ ఫెడరేషన్​ (జీసీఎంఎంఎఫ్​) పేర్కొన్నది.  కాగా, తాము ఎన్నడూ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సరఫరా చేయలేదని  జీసీఎంఎంఎఫ్ పేర్కొన్నది.

 తమ ప్రొడక్ట్స్​ క్వాలిటీకి తగ్గట్టు ఉంటాయని తెలిపింది. తాము కస్టమర్లకు ప్రీమియం నెయ్యిని అందజేస్తున్నట్టు పేర్కొంది. అమూల్​36 లక్షలమంది రైతుల కుటుంబాలకు చెందినదని, ఈ తప్పుడు సమాచారం వారి జీవనోపాధిపై ఎఫెక్ట్ చూపిస్తుందని తెలిపింది. అందుకే చట్టప్రకారం తాము చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.