
మెదక్ (చిలప్ చెడ్), వెలుగు : మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ లో హాస్టల్కు వెళ్లి చదువుకోవడం ఇష్టం లేని ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ మిస్బావొద్దీన్ కథనం ప్రకారం..గ్రామానికి చెందిన వెంకమ్మ కొడుకు సత్యనారాయణ(11) సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని హాస్టల్లో ఉంటూ ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి రాగా సోమవారం హాస్టల్కు వెళ్లమని తల్లి చెప్పగా వెళ్లనంటూ గొడవపడ్డాడు.
సాయంత్రం పనిమీద వెంకమ్మ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి సత్యనారాయణ చీరతో దూలానికి ఉరి వేసుకున్నాడు. దించి చూడగా అప్పటికే ప్రాణాలు పోయాయి. సత్యనారాయణ మానసిక స్థితి సరిగా లేదని, గతంలో కూడా రెండుసార్లు ఆత్మహత్య కు ప్రయత్నించగా కాపాడినట్లు తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఏఎస్సై తెలిపారు.