రిమ్స్ ఘటనపై రంగంలోకి విచారణ కమిటీ.. మెడికోల దాడిపై దర్యాప్తు ప్రారంభం

రిమ్స్ ఘటనపై రంగంలోకి విచారణ కమిటీ.. మెడికోల దాడిపై దర్యాప్తు ప్రారంభం

ఆదిలాబాద్ రిమ్స్ మెడికోలపై దాడి ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాలతో ప్రస్తుతం రిమ్స్ మెడికల్ కాలేజీ హాస్టల్స్ కు నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు శివప్రసాద్, వీవీ రావుల టీమ్ సభ్యులు చేరుకున్నారు.

బయట వ్యక్తులు రిమ్స్ మెడికల్ కాలేజీ హాస్టల్స్ లోకి ఎందుకు వచ్చారు..? వైద్య విద్యార్ధులపై ఎందుకు దాడి చేశారు..? వారిని ప్రోత్సహించింది ఎవరు..?  ఇందులో ఎవరి ప్రమేయం ఎంత ఉంది..? అనే కోణాల్లో విచారణ జరిపి నివేదిక తయారు చేయనున్నారు. పూర్తి నివేదికను రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు.

అసలేం జరిగింది..?  

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్​లో బుధవారం అర్ధరాత్రి అసిస్టెంట్​ప్రొఫెసర్​స్థాయి కాంట్రాక్ట్​ఫ్యాకల్టీ ఒకరు ఆగంతకులతో కలిసి హల్​చల్ చేశాడు. హౌస్​సర్జన్లపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో బాధితులు, మెడికోలు కలెక్టరేట్​ఎదుట ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు బాధ్యులను అరెస్ట్ చేయడంతో పాటు ప్రధాన నిందితుడిని టెర్మినేట్​చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

బాధితుల  కథనం ప్రకారం..కొద్ది రోజుల కింద రిమ్స్​దవాఖానలో సమస్యలపై డైరెక్టర్ ​జైసింగ్​రాథోడ్​ను హౌస్​సర్జన్లు ప్రశ్నించారు. ఇది మనసులో పెట్టుకున్న డైరెక్టర్, ఇతడి బంధువైన అసిస్టెంట్​ప్రొఫెసర్, డాక్టర్ ​క్రాంతికుమార్​కోపం పెంచుకున్నారు. అప్పుడే డాక్టర్​క్రాంతి స్నేహితుడైన వాసిమ్ అనే రౌడీషీటర్ రిమ్స్​కు వచ్చి ఓ హౌస్​సర్జన్ గల్లా పట్టుకున్నాడు. తర్వాత డాక్టర్ క్రాంతికుమారే గొడవలు ఎందుకంటూ కాంప్రమైజ్​ చేశాడు. అంతా సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు డాక్టర్ క్రాంతి కుమార్, రౌడీషీటర్ వాసిమ్, శివ, సాయికృష్ణ, వెంకటేశ్, శ్రీకాంత్​కలిసి కారులో రిమ్స్​కాలేజ్ గేటును తోసుకుంటూ హాస్టల్ కంపౌండ్​లోకి చొరబడ్డారు. 

‘ఇక్కడ డాక్టర్​కవిరాజు ఎవడ్రా?’ అని ప్రశ్నించడంతో తానేనంటూ ముందుకు వచ్చాడు. దీంతో అతడిని కొట్టడం మొదలుపెట్టారు. ఇది చూసిన అక్కడే ఉన్న కొందరు హౌస్​సర్జన్లు మీరెవరని ప్రశ్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ‘మేం రిమ్స్​ డైరెక్టర్ ఫ్యాన్స్ రా..’ అంటూ మరింత రెచ్చిపోయారు. దాడిలో డాక్టర్లు టి.కవిరాజ్​తో పాటు పెండెం నవీన్, భరత్, పి.నవీన్, విజయ్, అభిషేక్​కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మరికొంతమంది మెడికోలు అక్కడికి చేరుకొని దాడి చేస్తున్నవారిని ధీటుగా ఎదుర్కొన్నారు. దీంతో నిందితుల్లో ఒకరైన శివ కూడా గాయపడ్డాడు. ఈ క్రమంలో నిందితులు కారుతో ఢీకొట్టడంతో ఎగిరిపడ్డ డాక్టర్ ​పి.నవీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని నిందితులను అరెస్టు చేసి.. టూటౌన్​స్టేషన్​కు తరలించారు. 

కలెక్టరేట్ ఎదుట ధర్నా  

దాడిని నిరసిస్తూ హౌస్​సర్జన్లు, పీజీ డాక్టర్లు సుమారు 300 మంది గురువారం (డిసెంబర్ 14న) ఉదయం డ్యూటీలు బహిష్కరించి ఆందోళనకు దిగారు. డైరెక్టర్ ​జైసింగ్ రాథోడ్, డాక్టర్ క్రాంతికుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని బైఠాయించారు. డైరెక్టర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో కలెక్టర్​రాహుల్​రాజ్​బయటకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పినా వారు వినలేదు. వెంటనే డైరెక్టర్​ను మార్చాలని డిమాండ్ ​చేశారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారని, అడిషనల్ ​కలెక్టర్ శ్యామలాదేవితో విచారణ జరిపి ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని చెప్పడంతో శాంతించారు.

ఇది జరిగిన కొద్ది సేపటికే డైరెక్టర్ జైసింగ్​రాథోడ్ రిమ్స్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డా.క్రాంతికుమార్​ను టెర్మినేట్​చేస్తున్నట్టు ప్రకటించారు.10 మంది డాక్టర్లతో కమిటీ వేసి విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అడిషనల్​కలెక్టర్ శ్యామలాదేవి ఆలస్యం చేయకుండా రిమ్స్​కు చేరుకుని ఘటనపై విచారణ జరిపారు. గాయపడిన డా.తాళ్లపెల్లి కవిరాజ్ ​ఫిర్యాదు మేరకు డా.క్రాంతికుమార్, వాసిం, శివతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.​