
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ స్ర్పింటర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యెర్రాజీ జ్యోతి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. జ్యోతి, ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అన్ను రాణి సహా ఎనిమిది మంది ఇండియా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు వరల్డ్ ర్యాంకింగ్స్ ద్వారా పారిస్ బెర్తు దక్కించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ ఈవెంట్ల క్వాలిఫికేషన్ విండో జూన్ 30నే ముగిసింది. అయితే, ఈ మెగా గేమ్స్లో పోటీపడే అథ్లెట్ల జాబితాను వరల్డ్ అథ్లెటిక్స్ మంగళవారం అధికారికంగా నిర్ధారించింది. అథ్లెట్లు ఆయా ఈవెంట్లలో అర్హత ప్రమాణాలను అందుకోవడం లేదంటే క్వాలిఫికేషన్ విండో ముగిసిన తర్వాత రోడ్ టు ప్యారిస్ ర్యాంకింగ్స్తో తమ దేశం తరఫున పారిస్ కోటాలను సాధించవచ్చు.
విమెన్స్ 100 మీటర్ల హర్డిల్స్లో కటాఫ్ ర్యాంక్ 40 కాగా.. జ్యోతి 34వ స్థానంలో నిలిచి పారిస్కు ఎంపికైంది. జావెలిన్ త్రోయర్ అన్ను రాణి రోడ్ టు ప్యారిస్ ర్యాంకింగ్స్లో టాప్ –32 అథ్లెట్లలో 21వ స్థానంలో నిలిచి కోటా దక్కించుకుంది. మెన్స్ షాట్పుట్లో రెండుసార్లు ఆసియా చాంపియన్ అయిన తేజిందర్ పాల్ సింగ్ తూర్(23వ ర్యాంక్), విమెన్స్ షాట్పుట్ లో అభా ఖతువా (23వ ర్యాంక్) , విమెన్స్ 5000 మీటర్ల ఈవెంట్లో పారుల్ చౌదరి (34వ), మెన్స్ ట్రిపుల్ జంప్లో - అబ్దుల్లా అబూబేకర్ (21వ), ప్రవీణ్ చిత్రవేల్ (23వ), మెన్స్ హైజంప్లో సర్వేష్ కుషారే (23వ) కూడా అర్హత సాధించారు. మెన్స్ లాంగ్ జంప్ నేషనల్ రికార్డు హోల్డర్ జెస్విన్ ఆల్డ్రిన్ (33వ)... కటాఫ్ మార్కును (32) కొద్దిలో కోల్పోయాడు. కాగా, అర్హత ప్రమాణాలు అందుకోవడం ద్వారా ఇండియా నుంచి ఇప్పటికే 14 మంది అథ్లెట్లు ఒలింపిక్స్కు ఎంపికయ్యారు.