
అమరావతి: మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్ ధరలను భారీగా పెంచినట్టు సీఎం జగన్ తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇదే సమయంలో అక్రమ మద్యం రవాణాకు గట్టి చర్యలు చేపడతామని తెలిపారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ఏపీలో మరోసారి మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం.. మంగళవారం మధ్యాహ్నం ఇందుకు సంబంధింన జీవోను జారీ చేసింది.
పెంచిన మద్యం ధలు ఇవే..
రూ. 120 బ్రాండ్ మద్యంపై క్వార్టర్ కు రూ. 40, హాఫ్ బాటిల్ పై 80, ఫుల్ బాటిల్ పై 160 పెంపు. మినీ బీర్లపై రూ. 40, ఫుల్ బాటిల్ బీర్లపై రూ. 60 పెంచింది. రూ. 120-150 ధరలు ఉన్న మద్యంపై క్వార్టర్ పై రూ.60, హాఫ్ బాటిల్ పై రూ.120, ఫుల్ బాటిల్ పై రూ.320 పెంపు. రూ.150 కంటే ఎక్కువ ఉన్న మద్యం బ్రాండ్స్ పై క్వార్టర్ పై రూ.120, హాఫ్ పై రూ.240, ఫుల్ పై రూ. 480 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. కాగా ఇటీవలే ఏపీ ప్రభుత్వం మధ్యం ధరలను 25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో మద్యం ధరలు మొత్తం 75 శాతం పెరిగినట్టయింది.