
ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలు మే 6వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు విడుదలకానున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ఏడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ ఏడాది 18 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పది పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.