Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్ చివరిది.. టెన్నిస్‌కు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్ చివరిది.. టెన్నిస్‌కు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

సుదీర్ఘ టెన్నిస్ కెరీర్ కు స్టార్ ప్లేయర్ అండీ ముర్రే గుడ్ బై చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్ తన చివరి టెన్నిస్ టోర్నమెంట్ అని బ్రిటిష్ టెన్నిస్ స్టార్ ముర్రే తన అధికారిక సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. " పారిస్ ఒలింపిక్స్ నా చివరి టెన్నిస్ టోర్నమెంట్. ఒలింపిక్స్ కోసం నేను పారిస్ చేరుకున్నాను. నా కెరీర్‌లో ఇవి మరపురాని వారాలు. చివరి మ్యాచ్ ఇక్కడ ఆడుతున్నందుకు గర్వంగా ఉంది". అని ముర్రే తెలిపాడు. 

ముర్రే తొలిసారిగా 2008లో బీజింగ్‌లో జరిగిన ఒలంపిక్ గేమ్స్‌ ఆడాడు. ఈ ఒలింపిక్స్ లో ముర్రే తొలి రౌండ్ లోనే యెన్-హ్సున్‌తో ఓడిపోయి ఇంటిదారి పట్టాడు. 2012 లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో ముర్రే ఏకంగా స్వర్ణం గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో టెన్నిస్ దిగ్గజం  రోజర్ ఫెదరర్‌ను వరుస సెట్లలో ఓడించడం విశేషం. 2016 లో జరిగిన రియో ఒలింపిక్స్ లోనూ ముర్రే స్వర్ణం గెలిచాడు. దీంతో మెన్స్ విభాగంలో ఒలింపిక్స్‌లో రెండుసార్లు స్వర్ణం గెలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్ గా నిలిచాడు.

ముర్రే టెన్నిస్ కెరీర్ విషయానికి వస్తే 2005 లో ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి అడుగుపెట్టాడు. 19 సంవత్సరాల తన టెన్నిస్ కెరీర్ లో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచాడు. వీటిలో రెండు వింబుల్డన్, ఒక యూఎస్ ఓపెన్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సాధించాలనే కల తీరలేదు. మొత్తం 739 మ్యాచ్ ల్లో గెలిచిన ముర్రే.. 262 మ్యాచ్ ల్లో ఓడిపోయాడు. 2016 లో తొలిసారి నెంబర్ 1 ర్యాంక్ కు చేరుకున్నాడు.