
వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి..ఆకస్మిక పర్యటనలు చేస్తూ పనితీరు సరిగ్గా లేని అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. తాజాగా కుల్కచర్ల మండలం పీరంపల్లి గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆ గ్రామంలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని అంగన్ వాడీ టీచర్ వెంకటమ్మను కలెక్టర్ నారాయణ రెడ్డి సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణ సరిగ్గా లేదని పాఠశాల ఉపాధ్యాయురాలు పార్వతమ్మకు మెమో జారీ చేశారు.
అంతేకాదు.. డంపింగ్ యార్డ్ ఉపయోగంలో లేదని అధికారులపైనా జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.15 రోజుల్లో డంపింగ్ యార్డ్ ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పని చేయకుండా అధికారులు ఇలానే ఉంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గ్రామంలోని పారిశుధ్య పనులు సరిగా లేవని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనంలోని మొక్కలకు నీరు పోయడం లేదంటూ సీరియస్ అయ్యారు.15 రోజుల్లో మళ్లీ వచ్చి చూస్తానని, మార్పు లేకుంటే అధికారులను, ప్రజా ప్రతినిధులను కూడా సస్పెండ్ చేస్తానని కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు.
రెండు రోజుల క్రితం.. వికారాబాద్ జిల్లా దోమ మండలంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. దోర్నాల్ పల్లి పంచాయతీ ఇన్ చార్జ్ కార్యదర్శి సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేశారు. దోర్నాల్ పల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, శ్మాశనవాటిక నిర్మాణ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు అధికారులపై చర్యలు తీసుకున్నారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు ఎంపీఓ సోమలింగానికి కూడా మెమో జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించి నర్సరీల్లో మొక్కలు ఎండిపోవడానికి కారణమైన ఏపీఓ,టీఏల పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద నుండి 30 వేల రూపాయలు వసూలు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను, అంగన్ వాడీ కేంద్రాలను పరిశీలించారు. విద్యాభ్యాసం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి ప్రయోజకులు కావాలని విద్యార్థులకు కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.